హైదరాబాద్ : ఎన్నేళ్లు గడిచినా మహనీయులు ఎప్పటికీ చరిత్రలో నిలిచి పోతారని చెప్పడానికి ఎన్టీఆర్ సాక్ష్యం అన్నారు వైసీపీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి. ఆదివారం ఎన్టీఆర్ వర్దంతి సందర్బంగా ఆయన కు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఊరికే మహానుభావులు కాలేదని వాళ్ళు చేసిన మంచి పనుల వల్లనే మహానుభావులు అయ్యారని అన్నారు. ఎన్టీఆర్ కు మరణంల లేదని చెప్పారు. నమ్ముకున్న ఆశయం కోసం, తనను నమ్ముకున్న స్త్రీ కోసం పదవిని కూడా వదిలేయడానికి సిద్ధపడ్డారని అన్నారు. వెన్నుపోటు రాజకీయాలకు ఆయన తలవంచకుండా తన ఆశయాన్నికొనసాగిస్తానని చెప్పేవారన్నారు. అంతే కాకుండా సింహం ఎప్పుడూ పచ్చ గడ్డి తినదు..సింహం ఎప్పుడూ పోరాడి సాధించుకుంటుందని ఎన్టీఆర్ చెప్పేవారన్నారు.
తాను కూడా వెన్నుపోటుదారులపై యుద్ధం చేసి పదవిని దక్కించుకుంటానని చెప్పేవారన్నారు లక్ష్మీ పార్వతి . కానీ ఆయన శపతం నెరవేరక ముందే కన్నుమూయాల్సి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ ఆశయాన్ని నెరవేర్చేవాళ్లు చాలా మంది వస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ చివరికోరిక సగం తీరిందని, కొన్నిసార్లు కారు మబ్బులు వస్తాయని అన్నారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నామన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడంపై డ్రామా జరుగుతుందన్నారు. భూమి ఉన్నంత వరకు ఎన్టీఆర్ బతికే ఉంటారని సినీ నటుడు బాబు మోహన్ అన్నారు. ఎన్టీఆర్ తన దేవుడు అని, తనను ఎన్టీఆర్ తమ్ముడు అని సంభోదించే వాడని చెప్పారు. ఆయన మళ్లీ పుట్టి నటుడుగా ఓ వెలుగు వెలగాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ తిరిగి వస్తాడని తాను నమ్ముతానని, ఆయన శకపురుషుడని వ్యాఖ్యానించారు.
