25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి..ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

ఒకే రోజు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప

తిరుమల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమ‌లలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ ప‌ర‌మ పవిత్రమైన రోజున శ్రీ సూర్య దేవుడు జ‌న్మించాడ‌ని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్ర‌సాదించాడ‌ని వేదాల ద్వారా తెలుస్తోంది. రథ సప్తమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని భారీ సంఖ్యలో తిరుమ‌ల‌కు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ర‌థ‌సప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు.

వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) సూర్యప్రభ వాహనం. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం.ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తారు. ఇదిలా ఉండ‌గా ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా, సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు.

Leave A Reply

Your Email Id will not be published!