వరంగల్ జిల్లా : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.ఆదివాసీ వీరవనితలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం పుణ్యక్షేత్రం.. జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించే విధంగా రామప్ప – లక్నవరం నుంచి పైప్లైన్ ద్వారా నీటిని తరలిస్తామని అన్నారు. అలాగే ఈ పుణ్యక్షేత్రాన్ని తిరుమల – తిరుపతి, కుంభమేళాలను తలపించేలా ప్రతినిత్యం భక్తులు సందర్శించే విధంగా మేడారం ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. సమ్మక్క – సారలమ్మ మహాజాతర సందర్భంగా మేడారంలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాల్లో సహచర మంత్రులు, ఎమ్మల్యేలతో కలిసి పాల్గొన్నారు. మేడారంలో జరిగిన మంత్రిమండలి సమావేశం అనంతరం నిర్వహించిన ఈ ఉత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారరు. ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ సమ్మక్క – సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరం భక్తులు, పర్యాటకులు సందర్శించే విధంగా మేడారం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవం అని అన్నారు రేవంత్ రెడ్డి. గుడి లేని తల్లులను గుండెనిండా నింపుకుని జరుపుకునే అతిపెద్ద మేడారం జాతర కోసం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిగా సంతృప్తినిచ్చాయని చెప్పారు .2023 ఫిబ్రవరి 6వ తేదీన ఈ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని చెప్పాం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సమ్మక్క, సారలమ్మ ఆలయాన్ని కుంభమేళాను తలపించే విధంగా, ఆదివాసీలనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకర్షించేలా తీర్చిదిద్దాం అని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇది ఒక అరుదైన సందర్భం. అద్భుతమైన సన్నివేశం. వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్య పోయారని అన్నారు. జాతర ప్రారంభమయ్యే జనవరి 28 నాటికి పూర్తి చేయాలని చెప్పానని గుర్తు చేశారు.
