హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు , తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు పల్లె రవికుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. సోయి తప్పిన మాటలు, సొల్లు కబుర్లు చెబుతూ తెలంగాణపై నిత్యం విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, బీఆర్ఎస్ ను పాతరేయడమే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అంటూ పాలేరు సభలో సీఎం చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ గద్దెలు కూల్చడమంటే అది తెలంగాణ ప్రజల ధైర్యాన్ని కూల్చాలని అనుకోవడమేనని అన్నారు పల్లె రవి కుమార్ గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారో దీంతో తేటతెల్లమైందని అన్నారు. రేవంత్ రెడ్డివి సోయి తప్పిన మాటలు మాట్లాడటం మానుకోవాలని అన్నారు. తెలంగాణ ఆకాంక్ష లతో చెలగాటమాడిన టీడీపీని, చంద్రబాబు ను రాజకీయంగా పాతరేయకుండా రేవంత్ రెడ్డి లాగా నెత్తిన పెట్టుకుని ఊరేగుతరా ? అని ప్రశ్నించారు.
తెలుగు భాష పేరుతో తెలంగాణలో వనరుల దోపిడి, సాంస్కృతిక, సాహితీ, చారిత్రక అణచివేతను వ్యవస్థీకృతంగా కొనసాగించిన టీడీపీ ఉనికిని, పునరుజ్జీవనం కోరుకోవడమంటే ముమ్మాటికీ తెలంగాణ ద్రోహమే అవుతుందన్నారు పల్లె రవికుమార్ గౌడ్. రేవంత్ ఎప్పటికీ తెలంగాణ ద్రోహిగానే మిగిలి పోతాడని అన్నారు. తెలంగాణ వ్యతిరేకులకు, సమైక్యవాదుల ముసుగులో తెలంగాణను చెరబట్టిన వారికి నమ్మిన బంటుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. స్వీయ రాష్ట్రంలోనూ వారి ప్రయోజనాల కోసం తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన ద్రోహి అని ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో అసమానతలు, వివక్ష, అణచివేతల మూలంగానే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని అన్నారు. ప్రజలకిచ్చిన 420 హామీలు నెరవేర్చక పోతే కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా వందమీటర్ల లోతున ప్రజలు బొంద పెట్టడం ఖాయమన్నారు.
