హైదరాబాద్ : ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం గ్లోబల్ జీసీసీ హబ్గా ఆవిర్భవిస్తోందని అన్నారు. జీసీసీల వేగవంతమైన వృద్ధి ఐటీ ఇంజనీర్లు, టెక్నాలజీ నిపుణులకు గణనీయమైన ఉపాధి అవకాశాలను కల్పించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఐటీ మంత్రితో రీజెనెరాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బారి కోవల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశం అయ్యింది. ఈ సందర్బంగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అత్యంత నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల లభ్యత కారణంగా, ప్రముఖ గ్లోబల్ కంపెనీలు తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను (జీసీసీలు) స్థాపించడానికి హైదరాబాద్ ప్రాధాన్య గమ్యస్థానంగా ఎదుగుతోందని చెప్పారు. హైదరాబాద్లో జీసీసీల వేగవంతమైన వృద్ధి ఐటీ ఇంజనీర్లు, టెక్నాలజీ నిపుణులకు గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అమెరికాలోని న్యూయార్క్, టారిటౌన్లో ప్రధాన కార్యాలయం కలిగిన గ్లోబల్ బయోటెక్నాలజీ దిగ్గజం రీజెనెరాన్, అమెరికా వెలుపల తన మొదటి జీసీసీని స్థాపించడానికి తెలంగాణను ఎంచుకోవడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రపంచ ఖ్యాతిని మరింత పెంచుతుందని ఆయన అన్నారు. రీజెనెరాన్ కార్పొరేట్ ప్రధాన కార్యాలయం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలు న్యూయార్క్లోని టారిటౌన్లో ఉన్నాయని తెలిపారు. బారి కోవల్ , తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ సర్వేశ్ సింగ్ అవగాహన ఒప్పందాలను మార్చుకున్నారు. రీజెనెరాన్ ఇప్పటికే ఐర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాలలో కార్యాలయాలు, తయారీ సౌకర్యాలను నిర్వహిస్తున్నప్పటికీ హైదరాబాద్ కేంద్రం ఒక ప్రత్యేకమైన గ్లోబల్ హబ్గా పనిచేస్తుందని అన్నారు. ప్రతిపాదిత కేంద్రం కంపెనీ ప్రపంచవ్యాప్త కార్యకలాపాలను సమన్వయం చేస్తుందని, అలాగే క్లినికల్ ట్రయల్ కార్యకలాపాలు, అధునాతన డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ , కమర్షియల్ అనలిటిక్స్ వంటి ఉన్నత స్థాయి డిజిటల్ సేవలకు మద్దతు ఇస్తుందని చెప్పారు శ్రీధర్ బాబు.
