హైదరాబాద్ : ప్రస్తుతం ఆయిల్ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. జలవనరులపై యుద్ధాల వరకూ వెళ్లకుండా జాగ్రత్త పడాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ముందస్తు హెచ్చరిక చేశారు. నీటి యుద్ధాలకు ఆస్కారం లేకుండా మేలుకొందామని అన్నారు. జేఎన్టీయూలో ఓపెన్ జియోస్పేషియల్ కన్సార్టియంతో కలసి ఇండియన్ సొసైటీ ఆఫ్ జియోమేటిక్స్ – హైదరాబాద్ చాప్టర్ నిర్వహించిన వరల్డ్ వాటర్ డే ఉత్సవాలలో హైడ్రా కమిషనర్ మాట్లాడారు. నగర జనాభా అనూహ్యంగా పెరుగుతోంది. 1.60 కోట్లున్న నగర జనాభా 2050 నాటికి 3 కోట్లకు దాటే అవకాశం ఉంది. ఇలా పెరుగుతున్న జనాభా అవసరాలమేరకు నగరాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో నగరంలోని గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించిందని అన్నారు కమిషనర్.
ఆ దిశగా హైడ్రా వడివడిగా అడుగులు వేస్తోందని చెప్పారు. మొదటి దశ 6 చెరువులో మూడు ప్రారంభమవ్వగా.. మిగతా 3 చెరువులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. రెండోదశలో మరో 18 చెరువులను రెండో దశగా చేపట్టామని హైడ్రా కమిషనర్ చెప్పారు. కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో వర్షాకాలం వరదలు.. వేసవి కాలం నీటి ఎద్దడి సర్వ సాధారణంగా మారిందన్నారు. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణతో వరదలకు చెక్ పెట్టడమే కాకుండా.. నగరంలో భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎన్ ఆర్ ఎస్ సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్) డేటా ప్రకారం 1975 నుంచి 2023 లోపు నగరంలో 61 శాతం చెరువులు మాయమయ్యాయని.. మరో 15 ఏళ్లలో ఉన్నవి కూడా కనుమరుగయ్యే పరిస్థతి ఉందని హెచ్చరించిన విషయాన్ని హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
