ఎనర్జీ యూనివర్శిటీని ఏర్పాటు చేయండి

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎనర్జీ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాల‌న్నారు. ఇతర దేశాల్లో విద్యుత్ రంగంలో జరుగుతున్న పరిణామాల్ని అధ్యయనం చేయాల‌ని సూచించారు. టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ రంగంలోని టెక్నాలజీలను.. ఇన్నోవేషన్లను ప్రొత్సహించేలా ఎనర్జీ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని స్ప‌ష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. విద్యుత్ రంగంలో ఆవిష్కరణలను ప్రొత్సహించాలని అన్నారు. మంచి ఆలోచనలతో వచ్చే స్టార్టప్ కంపెనీలకు అవసరమైన మేరకు మార్జిన్ మనీ సమకూర్చేలా విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు.

దీని కోసం ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ ఫండ్ ఏర్పాటు చేసి స్టార్టప్ కంపెనీలకు ఆర్థికంగా చేయూత అందించాల‌ని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విద్యుత్ రంగంలో ఏపీ చాలా ముందుంది. ఇతర రాష్ట్రాలకు సంస్థలకు కన్సల్టెన్సీ సేవలు అందించేలా ఏపీ విద్యుత్ సంస్థలు ఎదగాలి. విద్యుత్ సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. విద్యుత్ సంస్థలకు అప్పులు పెను భారంగా మారాయి. ఛార్జీలు పెంచకుండా…విద్యుత్ సంస్థలకు ఉన్న అప్పులను తీర్చేలా ప్రణాళికలు రూపొందించాల‌ని సూచించారు. భూగర్భజలాలు పెంచుకుని విద్యుత్ ఆదా చేస్తున్నాం. ఇప్పటికే ట్రూ అప్ భారాన్ని ప్రజలపై వేయకుండా చర్యలు తీసుకున్నాం. విద్యుత్ ఛార్జీల్లో 13 పైసల మేర ట్రూడౌన్ చేశాం. కొనుగోలు భారాన్ని కూడా తగ్గించగలిగితే.. ప్రజలకు మరింత మేలు చేయవచ్చు అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!