50 మందిని సురక్షితంగా బయటకు తెచ్చిన డీఆర్ ఎఫ్
సంఘటనా స్థలాన్ని సందర్శించిన హైడ్రా కమిషనర్
హైదరాబాద్ : పెను ప్రమాదాన్ని హైడ్రా తప్పించింది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ద్వరా మంటలను క్షణాళ్లో నియంత్రించి అందులో చిక్కుకున్న50 మందికి పైగా ఉన్నవారిని హైడ్రా శుక్రవారం కాపాడింది. అమీర్పేటలోని ఆదిత్య ఎన్క్లేవ్లోని నీలగిరి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో విద్యుత్ కేబుళ్లున్న ప్యానల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ సమాచారం హైడ్రా కంట్రోల్ రూమ్కు సరిగ్గా ఉదయం 11.01 గంటలకు అందింది. క్షణాల్లో ఫీల్డ్మీద ఉన్నహైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలకు హైడ్రా కంట్రోల్ రూం సిబ్బంది చేర్చారు. ఆ చేరువలో ఉన్న హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది సరిగ్గా 11.04 నిమిషాలకు అక్కడకు చేరుకుని ఫైర్ ఎక్స్టింగ్విషర్ల ద్వరా మంటలను నియంత్రించారు. ఒక పక్క మంటలను అదుపులోకి తెస్తూనే హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో మరో రెండు బృందాలు అక్కడకు చేరుకున్నాయి. వీరితో పాటు.. ఫైర్, పోలీసు విభాగాలు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
మెట్ల మార్గం వద్దే కరెంటు కేబుళ్లు తగల పడడం.. పొగలు కమ్మేయడంతో రెండో అంతస్తులో చిక్కుకున్న వారిని హైడ్రా డీఆర్ ఎఫ్ వద్ద సిద్ధంగా ఉన్న రోప్ ల్యాడార్ల ద్వారా కిందకు దించారు. ఇలా మంటలనార్పడం.. వెంటనే సహాయక చర్యలు ప్రారంభమవ్వడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కలగలేదు. మంటలనార్పడం ఏమాత్రం ఆలస్యం అయినా..పెను ప్రమాదం సంభవించేది. అమీర్పేట అంటేనే ఐటీ రంగంతో పాటు.. పలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు శిక్షణ ఇచ్చే అడ్డా. ఇక్కడ ఉన్న మైత్రేయివనం, ఆదిత్య ఎన్క్లేవ్లో వందలాది శిక్షణ కేంద్రాలున్నాయి. ప్రతి అంతస్తులో పదుల సంఖ్యలో కోచింగ్ సెంటర్లున్నాయి. ఇక్కడ మంటలంటుకుంటే ఆ ప్రమాదాన్ని ఊహించలేం. వేలాది మంది ఇక్కడ శిక్షణ పొందుతుంటారు. అమీర్పేటలో అగ్ని ప్రమాదం అని తెలియడంతోనే నగరమంతా అప్రమత్తమైంది. హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది క్షణాల్లో స్పందించిన తీరుతో పాటు.. మంటలను ఆపడం, పై అంతుస్తుల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రోప్ ల్యాడార్ల సాయంతో కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. అక్కడ అగ్ని ప్రమాదానికి కారణాలను క్షేత్ర స్థాయిలో చూశారు.
