న్యూఢిల్లీ : నీట్ యుజి 2026లో చోటు చేసుకున్నలీకులకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో చేపట్టిన నిరసనలు ఫలించాయి. ఈ మేరకు అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో గత్యంతరం లేక ఇవాళ లోక్ సభ సాక్షిగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన చేశారు. తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ఆందోళనలు, నిరసనలను ప్రస్తావిస్తూ, యువత ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయమని వెల్లడించారు. దేశ యువతను ఉద్దేశించి చేసిన ప్రకటనలో గత మే 3న జరిగిన నీట్ యుజి పరీక్షలో ఆరోపించబడిన అక్రమాల తర్వాత తలెత్తిన పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాజీనామా లేఖను సమర్పించినట్లు ప్రధాన్ స్పష్టం చేశారు. కేంద్రం, రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాల భాగస్వామ్యంతో కూడిన సమగ్ర ప్రభుత్వ విధానం ద్వారా పరీక్షను రద్దు చేసి, జూన్ 21న తిరిగి నిర్వహించడం జరిగిందన్నారు కేంద్ర మంత్రి.
అంతే కాకుండా పరీక్ష లీకులపైదర్యాప్తును సీబీఐకి అప్పగించడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వం వేగంగా స్పందించిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షకు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారని, జూలై 16న ప్రకటించిన ఫలితాలు ఆ ప్రక్రియ విజయవంతమైందని సూచించాయని ఆయన అన్నారు. అయితే, ఇటీవల జరిగిన నిరసనలు, పరిణామాలపై ప్రధాన్ ఆందోళన వ్యక్తం చేశారు; కొంతమంది వ్యక్తులు విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం వల్ల అశాంతి నెలకొందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఈ సమస్య న్యాయపరమైన చిక్కులకు దారి తీయకూడదని లేదా దేశ వ్యతిరేక శక్తులు దీనిని తమ స్వార్థానికి వాడుకోకూడదని నొక్కిచెప్పారు. విద్యార్థులు తమ చదువు , భవిష్యత్తుపై దృష్టి సారించేలా చూడటానికే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
