తాడేపల్లి గూడెం : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి మెగా డీఎస్సీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అది మెగా డీఎస్సీ కాదని పూర్తిగా నిరుద్యోగులను, నిజాయితీగా కష్టపడి ప్రిపేర్ అయిన వారి పాలిట దగా డీఎస్సీ అని పేర్కొన్నారు. గురువారం జగన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రధానంగా డీఎస్సీపై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. గత రెండు వారాలుగా బయటకు వచ్చిన మరికొన్ని సాక్ష్యాలు, ఆధారాలు కూడా బయట పెట్టామన్నారు. ఇవి చూసిన తర్వాత ఎవరైనా ఈస్కాం నుంచి తప్పించు కోగలుగుతారా? అని ప్రశ్నించారు. ఎందుకంటే అలాంటి నివ్వెర పోయే వాస్తవాలు మనకు కనిపిస్తున్నాయన్నారు. డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయన్నారు. అందుకే చంద్రబాబుకు బీపీ పెరుగుతోందన్నారు. ఎవరైనా ఆధారాలు బయట పెడితే కేసులు పెడతాం, జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇది ఎంత వరకు సబబు అని నిలదీశారు. విచిత్రం ఏమిటంటే జర్నలిస్టుల మీద సైతం కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
మరోవైపు సోషల్ మీడియాలో కూడా నిలదీయకూడదంటూ అక్కౌంట్లను బ్లాక్ చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ డీఎస్సీ స్కాం ఎలా జరిగిందో, అనేక’సార్లు ఇదే వేదికపై నుంచి నేను సాక్ష్యాలు, ఆధారాలు చూపించానని అయినా పట్టించు కోవడం లేదన్నారు. తాను అడిగిన ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా చంద్రబాబు కానీ , ఆయన సుపుత్రుడు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ సూటిగా సమాధానం చెప్పడం లేదన్నారు. తాను అడిగిన ప్రశ్నలు కఠినమైనవని కావని చాలా సింపుల్ అని అన్నారు. ఇందులో అర్థంకాక పోవడానికి కూడా ఏమీ లేదన్నారు. రాష్ట్ర డీఎస్సీ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా, ప్రశ్న పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఈ రెండింటినీ, అంటే ప్రశ్నా పత్రాల తయారీ, పర్యవేక్షణ, ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు? ఎందుకు పారదర్శకతకు పాతర వేశారు? అని అడిగా? ఇది స్కాంకు ద్వారాలు తెరిచినట్టుకాదా? అని అడిగా? కాని చంద్రబాబు నోరు విప్పలేదు ఎందుకని ప్రశ్నించారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతని పేరు ఉన్న మెరిట్ లిస్టులను ఎందుకు మార్చారు? అతని ఐడీని ఎందుకు బ్లాక్ చేశారు. అతన్ని వెరిఫికేషన్కు ఎందుకు పిలవలేదు? అతను కోర్టుకు ఎందుకు పోయాడు? ఇది స్కాంను దాచిపెట్టడానికి చేసిన ప్రయత్నం కాదా? ప్రశ్నలను కూడా అమ్ముకున్నారని ఇటీవలే కొంతమంది అభ్యర్థులు చెప్పడం, మెగా డీఎస్సీలో లీకేజీ జరిగిందనడానికి మరింత బలాన్ని ఇవ్వడం లేదా? అని నిలదీశారు. ఎందుకు ఈ జీవోలు ఇచ్చారు? ఎందుకు పని అయిపోయిన తర్వాత, ఆ జీవోలను ఉపసంహరించారు? కారణం ఏంటి? టీచర్ పోస్టుల కోసం డబ్బులు తీసుకున్నారంటూ ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చినా, దీనిపై విచారణ ఎందుకు నిర్వీర్యం చేశారు? ఇప్పుడు బయటకు వస్తున్న కేస్స్టడీస్ అన్నీకూడా, వీటికి సంబంధించిన కోణాలే. తవ్వుతున్న కొద్దీ ఒక్కో అక్రమం, ఒక అక్రమాన్ని తవ్వుతుంటే ఇంకో అక్రమం బయటకు వస్తోందన్నారు.
జరగని పోటీలు జరిగినట్టుగా, ఆ పోటీల్లో వీళ్లు అద్భుతంగా ఆడినట్టుగా తప్పుడు సర్టిఫికెట్లతో సైతం పోస్టులు ఇచ్చేశారు. సీబీఐ విచారణ జరగాల్సిన అవసరాన్ని ప్రతి కేస్ స్టడీకూడా చెప్తోందన్నారు.
