అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిపై. గురువారం ఎన్డీయే నేతలతో అమరావతి బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా టెలికాన్ఫరెన్స్ చేపట్టారు. ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలుస్తోందన్నారు. రాజ్యసభలో మన రాజధాని అమరావతి బిల్లు కేంద్ర సహకారంతో పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందుతోందని చెప్పారు. అమరావతికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన అతి తక్కువ సమయంలోనే బిల్లును ప్రవేశ పెట్టడం ఆనందంగా ఉందన్నారు. అమరావతి మనకు ఒక సెంటిమెంట్ అని పేర్కొన్నారు. కానీ గతంలో పాలించిన జగన్ రెడ్డి ఏపీకి కావాలని 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా చేశారని ఆరోపించారు. ఇప్పుడు మావిగన్ అని మాట్లాడుతున్నారని, అమరావతి పట్ల వారికున్న ద్వేషానికి ఇది పరాకాష్ట అని ధ్వజమెత్తారు చంద్రబాబు నాయుడు.
అమరావతి పేరు పలకడానికే జగన్ ఇష్టపడరన్నారు. అందుకే మావిగన్ అని వింత పేరును తీసుకొచ్చారంటూ ఎద్దేవా చేశారు. గతంలోనూ ‘ఎస్ఆర్ఎం అమరావతి’ అని పేరు ఉంటే ఎస్ఆర్ఎంగా అంటూ మార్పించిన ఘనత తనదేనని పేర్కొన్నారు. అమరావతి పేరు వింటేనే జగన్కు కంపరంగా ఉండి నిత్యం విషం కక్కుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు . అమరావతి పట్ల జగన్ వైఖరి భవిష్యత్లోనూ మారదని నిన్నటితో మరోసారి స్పష్టమైందన్నారు. మా రాజధాని అమరావతి అని ప్రతీ ఒక్కరిలో భావన రావాలన్నారు. బిల్లు ఆమోదించి చేయూత ఇచ్చిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం. ఇక పల్లె పల్లెలో సంబురాలు చేపట్టాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి.
