న్యూఢిల్లీ : కర్ణాటకలో రాజకీయం మరింత వేడిని రాజేసింది. ఉన్నట్టుండి రాష్ట్రానికి చెందిన ఇద్దరు కీలక నేతలు ఢిల్లీకి రావాలని పేర్కొనడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠకు తెర లేపింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ఈ మేరకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు తమ తమ అనుంగు అనుచరులతో దేశ రాజధాని ఢిల్లీలో మకాం వేశారు. దీంతో సీఎంగా కొలువు తీరిన సిద్దరామయ్యను మార్చుతున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై పూర్తిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఈ సందర్బంగా ఆయన న్యూడిల్లీలో మీడియాతో మాట్లాడారు.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై వస్తున్న ఊహాగానాలకు తెర దించే ప్రయత్నం చేశారు. ఇదంతా కావాలని కొందరు చేస్తున్న దుష్ప్రచారం అంటూ కొట్టి పారేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎలా ప్రచారం చేస్తారంటూ ఎదురు ప్రశ్న వేశారు కేసీ వేణుగోపాల్. పార్టీ కీలక సమావేశం జరిగిందన్నారు. ఇందులో చర్చ మొత్తం కేవలం జరగబోయే రాజ్యసభ ఎన్నికలు, కర్ణాటక పరిషత్ ఎన్నికలపైనే కేంద్రీకృతమైందని చెప్పారు. మీరంతా చేస్తున్న ఊహాగానాలన్నీ కేవలం కల్పితాలేనంటూ పేర్కొన్నారు కేసీ వేణుగోపాల్. అందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.
ఈరోజు, మేము కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే , లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో కూలంకషంగా సమావేశం కావడం జరిగిందన్నారు . ఈ చర్చలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, కర్ణాటక ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి తో పాటు తాను కూడా పాల్గొన్నట్లు చెప్పారు. చర్చ మొత్తం కేవలం జరగబోయే రాజ్యసభ ఎన్నికలు, కర్ణాటక పరిషత్ ఎన్నికలపైనే కేంద్రీకృతమైందే తప్పా సీఎం మార్పు గురించి ఎలాంటి చర్చ రాలేదన్నారు కేసీ వేణుగోపాల్.