KTR Eatala : తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని, దీనికి ప్రధాన కారకుడు ఎవరో కాదు భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. దీంతో ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. పరిస్థితి సీరియస్ కావడంతో వెంటనే రంగంలోకి దిగింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు బుధవారం ఐటీ, పరిశ్రమల , పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ తో ఫోన్ లో మాట్లాడారు. అసలు ఏం జరుగుతుందో, ఎవరు కుట్రకు తెర తీశారో, దాని వెనుక ఉన్నది ఎవరో వెంటనే తేల్చాలని సూచించారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ భద్రతపై సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ తో వెంటనే విచారణ చేపట్టి, నివేదిక సమర్పించాలని కోరారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంటనే భద్రత కల్పించాలని ఆదేశించారు మంత్రి కేటీఆర్(KTR). దీంతో హుటా హుటిన డీజీపీ ఐపీఎస్ ఆఫీసర్ ను పురమాయించారు.
మాజీ మంత్రికి సంబంధించి ఏ రకమైన సెక్యూరిటీ కల్పించాలనే దానిపై సమీక్షించారు. మొత్తంగా ఈటల రాజేందర్, ఆయన భార్య జమునా రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. తాను హత్యా రాజకీయాలు చేయనని ఆ చేసేది ఈటల రాజేందరేనని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : CM KCR PV : దేశాన్ని కాపాడిన తెలంగాణ బిడ్డ పీవీ
