Saudi Arabia: సౌదీ బస్సు ప్రమాదం ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి జైశంకర్
సౌదీ బస్సు ప్రమాదం ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి జైశంకర్
యాత్రికులతో వెళ్తోన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 42 మంది సజీవ దహనం కాగా వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. మదీనాలో భారత పౌరులకు జరిగిన ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రభావిత కుటుంబాలకు రియాద్లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నాయని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తుండగా.. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్ ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు సహా 42 మంది సజీవ దహనమయ్యారని మీడియా కథనాలు వెల్లడించాయి. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాద్వాసులని సమాచారం.
