Nayanar Nagendran: మా కూటమిలోకి విజయ్ వస్తే స్వాగతిస్తాం – బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్
మా కూటమిలోకి విజయ్ వస్తే స్వాగతిస్తాం - బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్
Nayanar Nagendran : తమ కూటమిలోకి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్ వస్తే ఘనంగా స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీపీ రాధాకృష్ణన్ ఈ నెల 28న కోవైలో పర్యటించి కొడిసియాలో నిర్వహించనున్న పారిశ్రామికవేత్తల మహానాడులో పాల్గొననున్నారు. ఉపరాష్ట్రపతికి కోవై విమానాశ్రయంలో రాష్ట్ర బీజేపీ తరుఫున నాగేంద్రన్ ఘన స్వాగతం పలుకనున్నారు.
ఆయన పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు నయినార్ నాగేంద్రన్ (Nayanar Nagendran) గురువారం కోవై వెళ్లారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. డెల్టాలో సుమారు 12లక్షల హెక్టార్ల భూములు నీటమునిగాయని, ఈ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు వానలో తడిస్తున్నాయని, అయినా రాష్ట్రప్రభుత్వం దీనిపై స్పందించకపోవడ దారుణమన్నారు. ఈశాన్యాన్ని ఎదుర్కొనేందుకు వర్షానికి ముందే కేంద్రప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి రూ.250 కోట్లను విడుదల చేసిందని తెలిపారు.
Nayanar Nagendran – ధాన్యం కొనుగోలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ధాన్య్యం కొనుగోలుపై రాష్ట్రప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని నాగేంద్రన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు నిల్వవుండటానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని రాష్ట్ర ఆహారశాఖ మంత్రి చక్రపాణి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 2025-26వ ఆర్ధిక సంవత్సరంలో రైతుల నుండి కొనుగోలు చేస్తున్న ధాన్యంతో నాణ్యమైన బియ్యం కలిపేందుకు అవసరమైన మార్గదర్శకాలను కేంద్రప్రభుత్వం జూలై 28వ తేదీనే రాష్ట్రప్రభుత్వానికి పంపించిందని, అయితే మంత్రి చక్రపాణి వాస్తవాలను మరుగుపరిచి రైతులను మభ్యపెట్టేందుకు కేంద్రప్రభుత్వంపై బురదచల్లేలా వ్యాఖ్యానించారని ఆయన తెలిపారు.
మళ్లీ రాష్ట్ర పర్యటనకు విజయ్
‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్(Vijay) మళ్ళీ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే వారం పర్యటన ప్రారంభించాలని విజయ్ భావిస్తున్నారు. ఈ విషయంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్తో పాటు పార్టీ సీనియర్ నేతలతో ఆయన సమాలోచన చేస్తున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. గత నెల 27వ తేదీన విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ఆయన రాష్ట్ర పర్యటన నిలిపివేశారు. ఈ నేపథ్యంలో తాను నిలిపివేసిన పర్యటన మళ్ళీ ప్రారంభించేందుకు విజయ్ సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఒకటి రెండు రోజుల్లో వెల్లడికావచ్చని భావిస్తున్నారు. ఈ పర్యటన సమయంలో ప్రజల భద్రతపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు విజయ్ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా రోడ్షోలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు.
ఇకపై విశాలమైన మైదానాల్లోనే సభలు నిర్వహించాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. చెన్నై(Chennai) నుంచి ఆయా సభా ప్రాంగణాలకు హెలిక్యాప్టర్లో వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం బెంగళూరుకు చెందిన సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని టీవీకే వర్గాలు తెలిపాయి. ప్రజల రద్దీ, వాహన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా తన ప్రచారాన్ని కొనసాగించేలా టీవీకే పక్కా ప్రణాళికను ఖరారు చేస్తున్నట్టు తెలిసింది.
Also Read : D K Shivakumar: డీకే శివకుమార్పై ప్రతిపక్ష నేత అశోక్ సంచలన కామెంట్స్
