అమరావతి : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, బలగమని పేర్కొన్నారు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. గతంలో ఏపీని పాలించిన జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. రాజకీయాలను దాటి సామాన్య ప్రజల్ని నాటి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందన్నారు. 2019-24 మధ్య జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు నిత్యం గుర్తు చేయాలన్నారు. మనం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించడంతో పాటు కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం పడే కష్టాన్ని ప్రజలకు తెలియ చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. టీడీపీలో కార్యకర్తలే అధినేతలు అని పేర్కొన్నారు. రైట్ రాయల్గా బతకాలన్నారు. పార్టీ కూడా కార్యకర్తలను అంతే గౌరవిస్తుందని స్పష్టం చేశారు సీఎం.
కిల్లర్ పార్టీతో అందరూ జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలను హెచ్చరించారు. కిల్లర్ పార్టీ ఆలోచనా విధానాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి కౌంటర్ ఇవ్వాలని సూచించారు. వైసీపీ నేతలు రోడ్ల మీదకు వస్తారు. రెచ్చగొడతారు. రప్పా రప్పా అంటారు. ప్రజలను ఇబ్బందులు పెడతారు. చర్యలు తీసుకుంటే రాజకీయమంటారంటూ మండిపడ్డారు. అన్యాయం జరిగిందని పరామర్శకు వెళ్తారు… కార్యకర్తలను కార్ల కింద తొక్కించి చంపేస్తారు… కానీ తన కారు కింద పడిపోయిన కార్యకర్తను మాత్రం పరామర్శించరంటూ ఎద్దేవా చేశారు జగన్ రెడ్డిని ఉద్దేశించి. కడపలో సొంత పార్టీ కార్యకర్తనే హత్య చేశారని, కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కలిసి ప్రభుత్వ భూముల్ని దోపిడీ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
