​ప్రభుత్వంలో తెలంగాణ ఆర్టీసీ విలీనం : ఎండీ

సానుకూల నిర్ణ‌యం తీసుకుంద‌ని ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం నుంచి బ‌స్సులు రోడ్డు మీద‌కు రానున్నాయ‌ని, ప్ర‌యాణికులు గ‌మ‌నించాల‌ని కోరారు. ఉద్యోగ సంఘాలతో స‌ర్కార్ జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం అయ్యాయ‌ని తెలిపారు. ఇవాళ‌ మొదటి షిఫ్ట్ నుంచి రోడ్డు ఎక్కనున్నాయి తెలంగాణ ప్రగతి రథచక్రాలు అని పేర్కొన్నారు. అత్యంత సహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ చర్చల ఫలితంగా ఉద్యోగులు సమ్మెను విరమించార‌ని వెల్ల‌డించారు ఎండీ. తెల్లవారు జామున మొదటి షిఫ్ట్ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్సులు యధావిధిగా నడుస్తున్నాయ‌ని తెలిపారు.

కార్మికుల చిరకాల కోరికైన‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని స్ప‌ష్టం చేశారు. దీనికి సంబంధించిన విధి విధానాలు , ఇతర సాంకేతిక అంశాలపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రక‌టిస్తుంద‌ని పేర్కొన్నారు నాగిరెడ్డి .ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, 2021 పే స్కేల్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో వేతన సవరణ ఉందని తెలిపారు.ఆర్టీసీలో కార్మిక సంఘాల పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను నిర్వహించేందుకు త్వరలోనే కార్మిక సంఘాల తో చర్చలు జరిపి విధి విధానాలను ప్రకటించడం జరుగుతుందన్నారు.

గత మూడు రోజులుగా సమ్మె కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి సంస్థ చింతిస్తోందని అన్నారు. అన్ని డిపోల పరిధిలో వంద శాతం బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు తమ ప్రయాణాలను సురక్షితంగా ప్లాన్ చేసుకోవాలని ఎండీ కోరారు.

Leave A Reply

Your Email Id will not be published!