PM Modi: శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని మోదీ

శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని మోదీ

PM Modi : ఏపీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించారు. ప్రత్యేక విమానంలో కర్నూలు లోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ… అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ భ్రమరాంబ గెస్ట్ హౌస్‌ నుంచి బయలుదేరి నంది మండపం సర్కిల్ ద్వారా దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వైపు వచ్చారు. మోదీకి దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాన మంత్రికి విభూతి, కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు.

ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. అనంతరం మూలవిరాట్ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, మల్లెపూల అర్చన, మహామంగళ హారతి, మంత్ర పుష్పాలతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. భ్రమరాంబాదేవికి ఖడ్గమాల సమర్పించి కుంకుమార్చన పూజలు చేశారు. పూజలు తర్వాత నందీశ్వర దర్శనం చేసుకున్నారు. అర్చకులు అందించిన స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పూజలో భాగంగా.. ప్రధాన మంత్రి మోదీకి స్వామి, అమ్మవార్ల చిత్రపటాలు, శేష వస్త్రాలు ఆలయ పూజారులు అందించారు.

PM Modi – శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

కర్నూలు పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. రాజ దర్బార్ గోడలపై ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను తెలిపే శిల్పాలను ఆసక్తిగా పరిశీలించారు. అక్కడి శివాజీ విగ్రహం వద్ద నమస్కరించారు. శివాజీ దర్బార్‌ హాల్‌, ధ్యాన మందిరాలను పరిశీలించారు. ధ్యానముద్రలో ఉన్న శివాజీ, అమ్మవారి విగ్రహాలను దర్శించుకున్నారు. అమ్మవారి విగ్రహానికి భక్తిశ్రద్ధలతో పుష్పాలను సమర్పించారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్లారు. ఈ కేంద్రం నిర్వహణ బాగుందని ట్రస్టు నిర్వాహకులను ప్రధాని మోదీ అభినందించారు. అక్కడి నుంచి భ్రమరాంబ గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు.

PM Modi – ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ

కర్నూలు విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్‌ను చూపించి పరిచయం చేస్తూ… సీఎం చంద్రబాబు నవ్వారు. మంత్రి లోకేశ్‌ను చూసిన మోదీ ఆశ్చర్యంగా ఉందన్నారు. లోకేశ్‌ చాలా బరువు తగ్గి పోయావు అంటూ… మోదీ చమత్కారంగా మాట్లాడారు. త్వరలో మీ నాన్నలా తయారవుతావ్ అన్న మాట అని, లోకేశ్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానిస్తూ… నవ్వారు. ప్రధాని కామెంట్స్‌కు చంద్రబాబు, లోకేశ్ చిరునవ్వులు చిందించారు. అనంతరం లోకేశ్‌ను గుడ్ అంటూ.. భుజం తడుతూ ప్రధాని మోదీ ముందుకు సాగారు. కర్నూల్‌లోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఆయనకు ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ తదితరులు స్వాగతం పలికారు. ఆ సమయంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

Also Read : Deepak Reddy: జూబ్లీహిల్స్‌ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!