ఏపీ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ. 53,752.12 కోట్లు
ప్రతిపాదించడం జరిగిందన్న మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి : ఏపీ రాష్ట్ర సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ, అనుబంధ శాఖల బడ్జెట్ 2026-27 సంవత్సరానికి గాను మొత్తం రూ.53,752.12 కోట్లు ప్రతిపాదించానని చెప్పారు. రైతును రాజుగా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. ఇందులో పంచ సూత్రాలు అయిన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే అంశాలకి అధిక ప్రాధాన్యత కల్పించామన్నారు. ఇందులో భాగంగా రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “స్వర్ణాంధ్ర 2047” సాధన కోసం రూపొందించిన పది సూత్రాలలో వ్యవసాయ రంగానికి సంబంధించి “ఫార్మర్స్ అగ్రిటెక” ముఖ్యమైన సూత్రంగా ఉందన్నారు అచ్చెన్నాయుడు. డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్లు, రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా, వ్యవసాయాన్ని లాభదాయకంగా, అధిక ఆదాయ రంగంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర GSDP 17,62,357 కోట్ల రూపాయలు కాగా వ్యవసాయ రంగం వాటాగా 33.20 శాతం తో 5,39,454 కోట్ల రూపాయలు అందించినట్లు చెప్పారు. దేశ వ్యవసాయం వృద్ధి రేటు 0.80 శాతం కాగా, మనరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన, రాష్ట్ర వ్యవసాయరంగ వృద్ధి రేటు 7.83 శాతంగా నమోదయిందని వెల్లడించారు. దేశ వ్యవసాయరంగ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా 10 శాతం అని గర్వంగా తెలియజేస్తున్నానని శాసన సభ సాక్షిగా ప్రకటించారు.
