హైదరాబాద్ : మరోసారి ఫార్ములా ఇ రేస్ కేసు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ పోక్సో కేసు సంచలనంగా మారింది. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిస్సిగ్గుగా సపోర్ట్ చేయడం పట్ల తెలంగాణ సమాజం మండిపడుతోంది. ఇదే క్రమంలో ఉన్నట్టుండి ఫార్ములా ఇ కార్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) కోర్టు సమన్లు జారీ చేసింది.
హైదరాబాద్లో జరిగిన 2023 ఫార్ములా ఇ ఈవెంట్ సందర్భంగా ఒక విదేశీ కంపెనీకి సుమారు రూ. 55 కోట్లు బదిలీ చేయడంలో జరిగిన అవకతవకల ఆరోపణలకు సంబంధించి, నిందితులందరూ జూలై 31న హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఫార్ములా ఇ రేసుకు సంబంధించి జరిగిన ఆర్థిక అవకతవకల వివరాలను తెలియజేస్తూ ఏసీబీ ఇటీవల ఒక ఛార్జిషీట్ను దాఖలు చేసింది. విచారణ ప్రక్రియ కోసం కోర్టు ఇప్పుడు ఆ ఛార్జిషీట్ను లాంఛనంగా స్వీకరించింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఛార్జిషీట్లో కేటీఆర్ను నిందితుడు నెం. 1గా, అరవింద్ కుమార్ను ఏ2గా, బీఎల్ఎన్ రెడ్డిని ఏ3గా, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావును ఏ4గా, ఫార్ములా ఇ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ)ను ఏ5గా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తనకు సమన్లు జారీ చేయడం పట్ల స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. ఇదంతా కాంగ్రెస్ సర్కార్, సీఎం ఎ. రేవంత్ రెడ్డి కావాలని కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని ఆరపించారు. తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని ప్రకటించారు.
