భ‌క్తి, జ్ఞానం, యోగానికి ప్ర‌తిరూపం త‌రిగొండ వెంగ‌మాంబ‌

వైభ‌వోపేతంగా ముగిసిన 296వ జయంతి ఉత్సవాలు

తిరుపతి : మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తి, జ్ఞానం, యోగ సాధనల సమన్వయంగా వెలుగొందిన మహనీయురాలని ప్రముఖ సాహితీవేత్త శ్రీదేవి పేర్కొన్నారు. ఆమె జీవితం సంపూర్ణంగా శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తికి అంకితమై, ఆత్మ సాక్షాత్కారానికి మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో నిర్వహించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవాలు భక్తి వాతావరణంలో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం నిర్వహించిన సాహితీ సదస్సులో పండితులు వెంగమాంబ జీవితం, సాహిత్య విశిష్టతపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు.

ఈ సందర్భంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ యోగ జీవనం అనే అంశంపై శ్రీదేవి మాట్లాడుతూ, వెంగమాంబ రచనలు సమాజంలోని లోపాలను ప్రశ్నిస్తూ నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఆమె జీవితం భక్తి, తపస్సు, ఆత్మసాక్షాత్కారానికి ఆదర్శంగా నిలిచిందని వివరించారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం తెలుగు విభాగం సహాయాచార్యులు డా. సుభాషిని మాట్లాడుతూ వెంగమాంబ రచించిన “చెంచు నాటకం”లో స్త్రీ ఔనత్యం ప్రతిఫలిస్తుందని తెలిపారు. స్త్రీలోని ధైర్యం, స్వాభిమానం, సమానత్వ భావాలను వెంగమాంబ తన రచనల ద్వారా వెలుగులోకి తీసుకు వచ్చారని చెప్పారు.

మనస్తత్వ పరిశోధకులు డా. బాలాజీ దీక్షితులు మాట్లాడుతూ, వెంగమాంబ రచనలు భక్తి, భావోద్వేగం, ఆత్మానుభూతి సమన్వయంగా ఉండి భక్తిని పెంపొందిస్తాయని వివరించారు. సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి.

Leave A Reply

Your Email Id will not be published!