అమరావతి : నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు గారి మాటలను స్ఫూర్తిగా తీసుకున్నారు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మిషన్ చేపట్టారు. విద్యా సంవత్సరం ఆరంభంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యా శాఖా మంత్రి నేతృత్వంలో విద్యాశాఖ ఒక ప్రణాళిక రూపొందించింది. `వందరోజుల ప్రణాళిక`ను పకడ్బందీగా అమలు చేయడంతో టెన్త్లో ఉత్తమ ఫలితాలు వచ్చాయి. ఉత్తీర్ణతా శాతం మెరుగు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో టెన్త్ విద్యార్థుల కోసం రూపొందించిన 100-రోజుల కార్యాచరణ ప్రణాళికను 06-12-2025 నుండి 15-03-2026 పరీక్షల ఆరంభం అయ్యే వరకూ క్రమపద్ధతిలో అమలు చేశారు. ఈ కాలంలో విద్యార్థులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా 46 స్లిప్ టెస్టులు నిర్వహించారు. ఇందులో వచ్చిన మార్కులను LEAP మొబైల్ యాప్ లో పొందుపరిచారు. ప్రతిరోజూ 6 డ్యాష్బోర్డ్ల ద్వారా లీప్ యాప్లో మార్కులను విశ్లేషించారు.
స్లిప్ టెస్టులలో విద్యార్థుల సామర్థ్యాలను డ్యాష్ బోర్డు ద్వారా మదింపు చేసి షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ గా విద్యార్థులను గుర్తించారు. వారి సామర్థ్యాలకు అనుగుణంగా బోధించారు. సబ్జెక్టుల వారీగా సందేహాలను తీర్చే పద్ధతిని అవలంబించారు. సాధనమున పనులు సమకూరు ధరలో అన్న వేమన మాట స్ఫూర్తిగా విద్యార్థులతో క్రమపద్ధతిలో చేయించిన సాధన వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. వీరి నిరంతర సాధన కోసం అవసరమైన మోడల్ పేపర్లు, క్వశ్చన్ బ్యాంకులు విద్యాశాఖ ప్రచురించి ఉచితంగా అందించింది. వీటి ద్వారా విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధులను చేశారు. విభిన్న సామర్థ్యాలు కలిగిన విద్యార్థుల సాధనకు నాన్-లాంగ్వేజ్ సబ్జెక్టుల కోసం ద్విభాషా (Bi-lingual) క్వశ్చన్ బ్యాంకులు, మిర్రర్-ఇమేజ్ రూపంలో (ఒక వైపు తెలుగు, మరోవైపు ఇంగ్లీష్) ప్రచురించి అందించారు. వీటిని ప్రాక్టీస్ చేసిన విద్యార్థులు మెరికల్లా తయారయ్యారు.
