బడ్జెట్ దేశ ఆర్థిక క్రమశిక్షణకు ప్రతీక : నిర్మలా
పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ : పార్లమెంట్ లో ఆదివారం దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కీలక రంగాలకు వెసులుబాటు ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమలులోకి రానుందని ప్రకటించారు. ప్రాధాన్యతా రంగాలకు ప్రయారిటీ ఇచ్చామని తెలిపారు. అత్యధికంగా నిధులను కేటాయించినట్లు చెప్పారు. ఇదే సమయంలో భారతదేశ బడ్జెట్ ఆర్థిక క్రమశిక్షణకు ప్రతిజ్ఞ చేస్తూనే మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచుతుందని స్పష్టం చేశారు ఆర్థిక శాఖ మంత్రి. భారత్ వికసిత్ భారత్ వైపు ముందుకు సాగుతోందని, ఆదిశగా తమ కూటమి సర్కార్ కృషి చేస్తోందని తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సర్వే, దేశీయ వినియోగం పెరగడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.8% , 7.2% మధ్య వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. — అస్థిర ఆర్థిక మార్కెట్లు , వాణిజ్య అనిశ్చితి ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వృద్ధిని నిలబెట్టడంపై దృష్టి సారించడం జరిగిందన్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సందర్బంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు . భారతదేశం ఇప్పటి వరకు అమెరికా విధించిన అధిక సుంకాలను తట్టుకుని నిలబడిందన్నారు. దీనికి ప్రధాన కారణం సుస్థిరమైన, సమర్థవంతమైన నాయకత్వం కొలువు తీరి ఉండడమేనని అన్నారు.
