అమరావతి : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఈవోగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేసింది. ఉన్నట్టుండి ఆయనను బదిలీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆయన స్థానంలో తాత్కాలికంగా సీఎంఓలో విధులు నిర్వహిస్తున్న ముద్దాడ రవిచంద్రకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా తిరుమలలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఇందులో సిట్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా నివేదిక అందజేసింది. ఆనాడు జగన్ రెడ్డి హయాంలో ఈవోగా పని చేసిన అనిల్ కుమార్ సింఘాల్ పైనా కూడా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.
దీని కారణంగా తనపై బదిలీ వేటు వేసినట్లు సమాచారం ప్రధానంగా కల్తీ నెయ్యి సరఫరా అయ్యేందుకు ఆనాడు టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి కారణమని, తన హయాంలోనే నెయ్యి సేకరణ విధానంలో తీసుకు వచ్చిన మార్పులే ఇలా జరగడానికి కారణమైనట్లు నివేదికలో స్పష్టం చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఆనాడు టీటీడీకి ఈవోగా సింఘాల్ ఉన్నారు. తన ప్రమేయం లేకుండా ఎలా జరుగుతుందనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారాన్ని సకాలంలో గుర్తించక పోవడం లేక గుర్తించినా చూసీ చూడనట్లు వదిలేయడం క్షమించరాని నేరంగా సిట్ ఆక్షేపించినట్టు తెలుస్తోంది. విధి నిర్వహణలో ఆయన తీవ్ర నిర్లక్ష్యం వహించారని, టీటీడీ పాలక మండలి ఒత్తిడికి తలొగ్గారని గుర్తించినట్టు తెలిసింది. దీంతో ఈవోతో పాటు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీపై కూడా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.
