కూట‌మి స‌ర్కార్ విజ‌యం అమరావతి అజేయం

సంతోషం వ్య‌క్తం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : పార్ల‌మెంట్ లో అమ‌రావ‌తి రాజ‌ధానిగా బిల్లు ఆమోదం పొంద‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందటం ఆనందంగా ఉంద‌న్నారు. పార్లమెంట్ ఉభయ సభలు అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో రాష్ట్ర ప్రజలందరూ సంబరాలు చేసుకొనే ఆనందకర తరుణం వచ్చిందన్నారు. ఇకపై రాజధానిగా అమరావతి అజేయంగా ఉండ‌బోతోంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇంకెవ‌రూ కుట్ర‌లు ప‌న్నినా వ‌ర్క‌వుట్ కాద‌న్నారు. ఈ బిల్లుకు మద్దతు పలికిన పక్షాలకు, రాజ్యసభ సభ్యులకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనే అనవసర అపోహలను రాష్ట్ర ప్రజలందరూ విడిచిపెట్టేయాలని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రానికి రాజధాని నగరం ఉండటమే ఇష్టం లేని వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజాలెవరూ పట్టించు కోవలసిన అవసరం లేదన్నారు. అలాంటి వ్యాఖ్యల ద్వారా సదరు వ్యక్తుల నైజం మరోమారు బయట పడిందన్నారు.

అమరావతిలో అభివృద్ధి కార్యకలాపాలు ఇప్పటికే వేగవంతం అయ్యాయని తెలిపారు. ఈ రాజధానిని ప్రతి ఒక్కరూ తమదిగా భావించే విధంగా తీర్చిదిద్దే బాధ్యతనుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకొందన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ముందుకు తీసుకువె ళ్లడంతోపాటు, రాజధాని నగర అభివృద్ధికి బలమైన తోడ్పాటు ఇస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, హోం శాఖ మంత్రి అమిత్ షాకి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు డిప్యూటీ సీఎం. పార్లమెంట్ ఉభయ సభల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఆమోదం తరుణంలో రాష్ట్రంలో కూటమి పక్షాలు చేసే సంబరాల్లో భాగస్వాములు కావాలని జనసేన నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు.

Leave A Reply

Your Email Id will not be published!