అమరావతి : ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. శనివారం శ్రీకాకుళం జిల్లా బూర్జ, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, మెరక ముడియం, రాజాం, రేగడి ఆముదాల వలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, పాలకొండ, సాలూరు, సీతానగరం మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. రాయలసీమ జిల్లాల్లో 40-42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందన్నారు. విజయనగరం జిల్లాలో నాలుగు మండలాలు, పార్వతీపురం మన్యం7, పోలవరం 2, ఏలూరు 1, కృష్ణా 5, ఎన్టీఆర్ 9, గుంటూరు 16, బాపట్ల 1, పల్నాడు 21, ప్రకాశం జిల్లాల్లోని 2 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు హెచ్చరించారు. ఇక ఆదివారం రోజు 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
నంద్యాల(జి) గుల్లదుర్తిలో 42.1°C, కడప(జి) కమలాపురంలో 42°C, పల్నాడు(జి) గురజాల, తిరుపతి(జి) వరదయ్యపాలెంలో 41.8°C, అనంతపురం(జి) తెరన్నపల్లి 41.6°C, కర్నూలు(జి) తోవిలో 41.4°C, కృష్ణా(జి) పెద్దపారుపూడి 41°C, ఏలూరు(జి) ధర్మాజీగూడెం 40.4°C, మార్కాపురం(జి) బొట్లగూడూరు 40.2°C, అన్నమయ్య(జి) కంభంవారిపల్లె 40.1°C, తూర్పుగోదావరి(జి) చిట్యాలలో 40°C చొప్పున నిన్న అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నారు.
