గోవింద నామ స్మరణతో మార్మోగిన తిరుమల

గరుడ వాహనంపై వైభవంగా శ్రీమలయప్ప స్వామి

తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవ తిరుమలలో భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగింది. స్వర్ణ గరుడ వాహనంపై శ్రీమలయప్ప స్వామి నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు . సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహన మండపం నుంచి స్వర్ణ గరుడ వాహనంపై స్వామి వారు వెలుపలకు రాగానే నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ భక్తులతో కిక్కిరిశాయి. లక్షలాది భక్తులు స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటూ “గోవిందా… గోవిందా…” అంటూ చేసిన నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. నాలుగు మాడ వీధుల్లో ఏర్పాటు చేసిన 190 గ్యాలరీల్లో సుమారు 1.80 లక్షల మంది భక్తులు వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. రాత్రి నుంచే అనేక గ్యాలరీలు భక్తులతో నిండి పోయాయి.

తెల్లవారుజాము నుంచే గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు పాలు, అన్నప్రసాదం, పానీయాలు, అల్పాహారాన్ని టీటీడీ అందించింది. భక్తులకు అన్నప్రసాదం, తాగునీటి పంపిణీతోపాటు రద్దీ నియంత్రణ, చిన్నారులకు ట్యాగింగ్‌ తదితర సేవల కోసం సుమారు 2,000 మంది శ్రీవారి సేవకులను ప్రత్యేకంగా నియమించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షించేందుకు టీటీడీ సుమారు 600 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించింది. తిరుమలలోని ఎనిమిది కీలక ప్రాంతాల్లో సెక్టోరల్‌ అధికారులను ఏర్పాటు చేసి 24 గంటలపాటు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

టీటీడీ ఛైర్మన్‌ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి గ్యాలరీలను ఎప్పటికప్పుడు పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. భక్తుల నుంచి నేరుగా అభిప్రాయాలను కూడా సేకరించారు. జేఈవోలు డాక్టర్‌ ఎ. శరత్‌, ప్రభల గోపీనాథ్‌ శిలాతోరణం నుంచి వెలుపలికి వచ్చే క్యూలైన్లను సందర్శించి అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించారు. టీటీడీ సీవీఎస్వో కే వి మురళీకృష్ణ, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు గ్యాలరీలు, వెలుపలి క్యూలైన్లలో రద్దీ నియంత్రణను నిరంతరం పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!