న్యూఢిల్లీ : భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ తో జరిగిన చిట్ చాట్ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ను పక్కన పెట్టడంపై స్పందించాడు. ప్రధానంగా తన కోచ్ కెరీరలో అత్యంత కఠినమైన నిర్ణయం ఇంగ్లాండ్ పర్యటనలో శాంసన్ను పక్కనపెట్టడం అని పేర్కొన్నాడు. తన కోచింగ్ కాలంలోనే బహుశా అత్యంత దారుణమైన డెసిషన్ అన్నాడు. వరుసగా తక్కువ స్కోర్లు చేసిన తర్వాత, ఇంగ్లాండ్తో జరిగిన టి20 సిరీస్లో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం శాంసన్ తన స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. స్వదేశంలో భారత్ సాధించిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2026 ప్రపంచ కప్ విజయంలో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజు శాంసన్ను, ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలో జట్టు నుంచి తప్పించడం తనను ఎక్కువగా బాధ కలిగించిందన్నాడు.
అయితే తాజాగా ఆఫ్ఘనిస్తాన్పై 3-0తో ఘనవిజయం సాధించిన సిరీస్లో రెండుసార్లు 50కి పైగా పరుగులు చేసిన అభిషేక్ శర్మ , శాంసన్ అనే స్థిరమైన ఓపెనింగ్ జోడీ వైపు భారత్ తిరిగి మొగ్గు చూపింది. అన్నింటి కంటే ముందు, (ఆటలో లేనప్పుడు సరైన సమాచార మార్పిడి విషయంలో) అతను నాకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డ్రెస్సింగ్ రూమ్లో ఉండటానికి అతని ప్రతిభే సరిపోతుంది. శాంసన్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ప్రతిభ లేకుండా ఎవరూ ప్రపంచ కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలవలేరు. కాబట్టి అతను తగినంతగా రాణించాడు అని సిరీస్ ముగింపు తర్వాత మీడియాతో మాట్లాడుతూ గంభీర్ శాంసన్ను ప్రశంసించారు. నిస్సందేహంగా, అది కఠినమైన నిర్ణయం శాంసన్ను పక్కన పెట్టడం. బహుశా ఆ ఇంగ్లాండ్ సిరీస్లో అతన్ని పక్కన పెట్టడమే.
ఎందుకంటే అంతకు ముందు అతను అద్భుతంగా రాణించాడు. కానీ కొన్నిసార్లు ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని మాజీ భారత బ్యాటర్ చెప్పారు. తదుపరి అవకాశం కోసం సూర్యవంశీ వేచి చూడాల్సిందేనని గంభీర్ స్పష్టం చేశారు. ఈ సిరీస్లో, ప్రపంచ కప్ సమయంలో మాకున్న జట్టు కూర్పునే మళ్లీ కొనసాగించాలని తాము చాలా స్పష్టంగా అనుకున్నామని పేర్కొన్నాడు గంభీర్. ఎందుకంటే మూడు, నాలుగు సార్లు విఫలమైనంత మాత్రాన ఆ ఆటగాళ్లు చెడ్డవారిగా మారిపోరు. ఒక ప్రపంచ కప్ నుండి తదుపరి ప్రపంచ కప్ వరకు అజేయంగా నిలిచి, టైటిల్ గెలిచిన జట్టు… ఒకటి రెండు సిరీస్లలో ఓడి పోయినంత మాత్రాన అకస్మాత్తుగా చెడ్డ జట్టుగా మారిపోదు. రెండు మూడు వైఫల్యాలతో ఆటగాళ్ల ప్రతిభ తక్కువైపోదు.
వైభవ్ విషయంలోనూ తన అవకాశం కోసం వేచి చూడాలనే విషయం చాలా స్పష్టంగా చెప్పామని తెలిపాడు. అతనిలో ఉన్న ప్రతిభ మాకు తెలుసన్నాడు. ఆటగాళ్ల ఎంపికలో దీర్ఘకాలిక ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని ప్రధాన కోచ్ చెప్పారు. అయితే, జట్టులోకి కొత్తగా వచ్చిన వారి కంటే, గత రెండేళ్లుగా అద్భుతంగా రాణిస్తున్న ఆటగాడికే ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి, అతనికి అవకాశం వచ్చినప్పుడు, ఎక్కువ కాలం ఆడే అవకాశం కూడా లభిస్తుందని స్పష్టం చేశాడు. భారత క్రికెట్ అంటేనే అది. మాకు పోటీతత్వం కావాలి, డ్రెస్సింగ్ రూమ్లో అటువంటి ప్రతిభావంతులు ఉండాలి. కానీ కొన్నిసార్లు క్రికెట్లో పరిస్థితులు అలా ఉంటాయి. 15 ఏళ్ల వయసున్న వారైనా, 30 ఏళ్ల వారైనా… అవకాశం కోసం వేచి చూడాల్సిందే అని గంభీర్ అన్నారు.
