న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని క్వాంటం, ఏఐ హబ్ గా మారుస్తామని అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొన్నారు. పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సదస్సులో ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీలో క్వాంటం-ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌళిక వసతుల అభివృద్ధి కల్పించే దిశగా ఏడు ఒప్పందాలు చేసుకున్నారు. ఏపీని క్వాంటం-ఏఐ హబ్ గా తీర్చిదిద్దడం, అమరావతిలోని క్వాంటం వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేలా ఎంఓయూలు కుదుర్చుకున్నారు.
భవిష్యత్ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా విద్యార్థులు, యువతకు ఏఐ-క్వాంటం రంగాల్లో శిక్షణ, ప్రభుత్వ శాఖల్లో ఏఐ-క్వాంటం వినియోగం, టెక్నాలజీ ద్వారా ప్రజలకు సేవలను సులభతరం చేయడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. క్వాంటం, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు యూనైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (UNICC)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి ఏఐ క్వాంటం ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. ఏఐ-క్వాంటం డిజిటిల్ ఎంబసీగా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను తీర్చిదిద్దేలా ప్రణాళికలు తయారు చేశామని పేర్కొన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం కార్యక్రమానికి హాజరైన యూఎన్ఐసీసీ డైరెక్టర్ సమీర్ చౌహాన్ సహా ఆ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
