అమరావతి : మోదీ సర్కార్ కార్పొరేట్లకు వంతం పాడుతూ కీలకమైన జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడి చేందుకు ప్రయత్నం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(MGNREGA) పరిరక్షణ యాత్ర గురువారం పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. వినుకొండ నియోజకవర్గం వేల్పూరులో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి గ్రామస్థులంతా హాజరయ్యారు. కరువు పనిపై కేంద్రం చేసిన కుట్రలను వివరించారు. మోదీ పాలనలో ఏనాడు కూడా 100 రోజుల పాటు పని ఇవ్వలేదని వాపోయారు. తమ గ్రామంలో 20 రోజులు పని ఇచ్చిందే ఎక్కువని, చేసిన పనికి సైతం వేతనాలు గడువు ప్రకారం చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు షర్మిలతో కూలీలు. కరువు పనిపైనే బ్రతికే వారి కార్డులు చెప్పాపెట్టకుండా తొలగించారని గ్రామానికి చెందిన ఉపాధి హామీ శ్రామికులు లక్ష్మమ్మ, పుల్లారెడ్డి, దేవయ్యలు ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీ తెచ్చిన కొత్త పథకం VB G- RAM G చట్టం వద్దని రచ్చబండ వేదికగా గ్రామస్థులంతా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అమలు చేసిన ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరారు. యూపీఏ హయాంలో తీసుకు వచ్చిన ఉపాధి హామీ పథకం వల్ల గ్రామసభలోనే పనుల నిర్ణయం జరిగేదన్నారు. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే పని ఇచ్చే వారని, ప్రతి కుటుంబానికి 100 రోజుల పాటు ఉపాధి గ్యారంటీ ఇవ్వబడిందన్నారు. కూలీలకు వేతనం 14 రోజుల లోపు అని నిర్ణయించారని తెలిపారు. ఆడ – మగ అనే తేడాలేకుండా సమాన కూలి చెల్లించడం జరిగిందన్నారు. యంత్రాల వాడకాన్ని నిషేధం విధించారని తెలిపారు షర్మిల. కూలీల వేతనాలు వంద శాతం కేంద్రమే ఇచ్చేదన్నారు. మరో వైపు మోదీ తీసుకు వచ్చిన వీబిజీ రామ్ జీ చట్టంలో పైవాటికి పూర్తిగా తూట్లు పొడిచారంటూ సంచలన ఆరోపణలు చేశారు షర్మిలా రెడ్డి.
