అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకు పోతోందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభను పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో నిర్వహించారు. పెదఅమిరంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు వెళ్తోందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 67 లక్షల మంది లబ్ధిదారులకు ఏటా సుమారు రూ.33 వేల కోట్ల వ్యయంతో పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం కింద రూ.10 వేల కోట్లకు పైగా నిధులను అర్హులైన తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆర్ అండ్ బి రహదారుల నిర్మాణం చేపట్టడంతో పాటు డీసీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోనూ సిమెంట్ రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు అభివృద్ధి కోసం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇతర రాష్ట్రాలకు తరలించే పరిస్థితులను సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చించి అడ్డుకున్నారని, ప్లాంట్ ను పరిరక్షించే చర్యలు చేపట్టారని వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి మండల ఆక్వా రైతుల విజ్ఞప్తి మేరకు 16 హెచ్పీ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఐయినవల్లిలో 400 కేవీ సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు.
