కర్ణాటకలో కోలుకోలేని దెబ్బ తగిలింది భారతీయ జనతా పార్టీకి. తాజాగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని షాక్ ఇచ్చారు. 224 సీట్లకు గాను 132 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది కాంగ్రెస్. ఇక బీజేపీ 65 సీట్లకు మాత్రమే పరిమితమైంది.
రాష్ట్రంలో సీఎం బొమ్మై ఉన్నా అన్నీ తానై ముందుండి నడిచారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన సుడిగాలి పర్యటన చేశారు. పలుమార్లు కన్నడ నాట పర్యటించారు. రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తించారు. ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా కలిసి పని చేసినా గెలవలేక పోయింది.
కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా డబుల్ ఇంజన్ సర్కార్ ను తిప్పి కొట్టారు జనం. ప్రజలు మతానికి, కులానికి, విద్వేషాలతో రెచ్చగొడితే తాము ఒప్పుకోమంటూ స్పష్టం చేశారు. ఒక రకంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ గెలుపు ఒక టానిక్ లాగా పని చేస్తుందని అనుకోవడంలో తప్పు లేదు.
ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రాబోయే సార్వత్రిక ఎన్నికలపై తప్పక ప్రభావం పడక తప్పదు. మొత్తంగా వేల కోట్లు మంజూరు చేసినా జనం నమ్మ లేదు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిన సర్కార్ ను బండకేసి కొట్టారు. ఇది బీజేపికి చెంప పెట్టు లాంటిది.
