Tirumala Rush : పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. భారీ ఎత్తున తరలి వచ్చారు. రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తయినా భక్తుల సంఖ్య పెరిగింది. నిన్న ఒక్క రోజే శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 87 వేల 171 మంది భక్తులు దర్శించుకున్నారు.
ఇదిలా ఉండగా శ్రీవారికి 3 వేల 273 మంది తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. గత మూడు రోజులుగా వరుసగా స్వామి వారి హుండీ ఆదాయం పెరుగుతుండడం విశేషం. భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల రూపేణా 3 కోట్ల 68 లక్షల హుండీ ద్వారా లభించిందని టీటీడీ పేర్కొంది.
భక్తులు భారీగా పెరగడంతో తిరుమల లోని కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వద్ద వరకు లైన్ నిలిచి ఉంది. కాగా ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల దర్శనానికి సంబంధించి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా టీటీడీ పాలక మండలి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఏర్పాట్లను స్వయంగా టీటీడీ చైర్మన్ , ఈవో పరిశీలించారు. సంతృప్తిని వ్యక్తం చేశారు.
Also Read : Delhi Drain : ఢిల్లీలో సహాయక చర్యలు ముమ్మరం
