Pavithra Samarpana : శ్రీవారికి ఘనంగా పవిత్ర సమర్పణ
ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు
Pavithra Samarpana : తిరుమలలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభోపేతంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా శ్రీవారి ఆలయంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాలలో భాగంగా స్వామి వారికి పవిత్ర సమర్పణ ఘనంగా నిర్వహించారు.
పుణ్య క్షేత్రంలోని యాగశాలలో హోమాలు, తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
Pavithra Samarpana in Tirumala
వేద ఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జయ విజయులకు, గరుడాళ్వారుకు, వరదరాజ స్వామి వారికి, వకుళ మాత అమ్మ వారికి, ఆనంద నిలయం, యాగశాల, విష్వక్సేనుల వారికి, యోగ నరసింహస్వామి వారికి, భాష్యకార్లకు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీ భూవరాహస్వామి వారికి, శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి పవిత్ర మాలలు సమర్పించారు.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపట్టారు.
పవిత్రోత్సవాలను పురస్కరించుకుని కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ(TTD) రద్దు చేసింది.
Also Read : Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ
