YS Sharmila Reddy: వైఎస్ షర్మిలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

వైఎస్ షర్మిలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

YS Sharmila Reddy : ప్రధాని మోదీ గతంలో శంకుస్థాపన చేసిన రాజధాని గ్రామమైన ఉద్దండరాయిని పాలేం పర్యటనకు బయలుదేరిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. ఉద్దండరాయుని పాలెంలో బుధవారం షర్మిల పర్యటించాలని నిర్ణయించారు. అయితే పోలీసుల నుండి అందుకు అనుమతి తీసుకోకపోవడంతో…. ఉద్దండరాయునిపాలెం పర్యటనకు అనుమతి లేదంటూ షర్మిల ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతానికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆమె నివాసం వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల తీరుపై ఏపీసీసీ చీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎలాగైన ఉద్దండరాయుని పాలెం వెళ్లి తీరుతానంటూ షర్మిల(YS Sharmila Reddy) పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో షర్మిల నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా ఆంధ్ర రత్న భవన్ లో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila Reddy) మాట్లాడుతూ… ఒక మహిళ మీద, అది కూడా కాంగ్రెస్(Congress) రాష్ట్ర అధ్యక్షురాలిపై పోలీసులు జులం ప్రదర్శించడం దారుణమన్నారు. దీనికి చంద్రబాబు, హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనను ఎందుకు హౌస్ అరెస్టు చేస్తున్నారో సమాధానం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పక్షాన కమిటీ వేసుకుని రాజధానిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. అక్కడ పరిస్థితులు పరిశీలనకు కమిటీ వేసుకుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందని అడిగారు. కాంగ్రెస్ పార్టీ తరపున తాము అడిగే ప్రశ్నలు, చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు.

‘అమరావతి క్యాపిటల్ కమిటి 28న వేస్తే… మీకెందుకు అంత భయం. అక్కడ ఏం దాయాలని చూస్తున్నారో‌ ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. మోడీ అమరావతి పర్యటనపై మా యాక్షన్ ప్లాన్ కోసం పార్టీ ఆఫీస్‌లో మీటింగ్ పెట్టాం. అక్కడకు వెళుతుంటే నన్ను అడ్డుకుంటున్నారు. రేపు మోడీ పర్యటనపై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది. మన ఏపీలో ప్రజా సమస్యలపై మాట్లాడకూడదా. మీటింగ్ లు పెడితేనే అడ్టుకుని, అరెస్టు చేస్తారా. ఇదేనా మీ కూటమి వైఖరినా పోలీసు వ్యాన్లలో పోలీసులను భారీగా దించారు. నా వల్లే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందా. కమిటి వేస్తేనే అరెస్టు అంటే… ఆందోళన చేస్తే మమ్మలను చంపేస్తారేమో. పోలీసులు కూడా చట్టబద్ధంగా పని‌చేయండి. నా మీద చేయి కూడా వేశారు… ఇది కరెక్ట్ విధానమా. ప్రజా స్వామ్యంలో పోరాటం చేసే హక్కు మాకు ఉంది. పోలీసులు ఆడవాళ్లను రక్షించడంలో దృష్టి పెట్టండి. నన్ను అడ్డుకుని… బయటకి రావద్దంటారా. ప్రభుత్వం, పోలీసులు మా హక్కులను కాల రాస్తే చూస్తూ ఊరుకోం. అరెస్టులతో మా పోరాటాలను ఆపలేరు, అడ్డుకోలేరు’ అంటూ షర్మిల స్పష్టం చేశారు.

YS Sharmila Reddy – ఎక్స్ వేదికగా షర్మిల ఆగ్రహం

ఈ సందర్భంగా తన అఫీషియల్ సోషల్ మీడియా వేదికగా వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు… విజయవాడలోని నా విల్లాలో నన్ను ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచారు? ఏ కారణం చేత అనేది… దయచేసి ఏపీ ప్రజలకు సమాధానం చెప్పండి. నేను ఎక్కడకైనా వెళ్లే హక్కు నాకు ఉంది. ఏపీసీసీ అధ్యక్షురాలిగా పీసీసీ కార్యాలయానికి‌ వెళ్లడం నేరమా. మీరు మా రాజ్యాంగ హక్కులను ఎందుకు కాలరాయడానికి ప్రయత్నిస్తున్నారు? మీ ప్రభుత్వం దేనికి భయపడుతోంది?’ అంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షర్మిల ప్రశ్నలు సంధించారు.

Also Read : Revanth Reddy: కేసీఆర్‌పై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!