Durga: రూ.300 కోట్ల రూపాయలతో ఖరీదైన దుర్గా మండపం
రూ.300 కోట్ల రూపాయలతో ఖరీదైన దుర్గా మండపం
Durga : మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో ఒక్కోటి 50 అడుగుల ఎత్తు గల పన్నెండు జ్యోతిర్లింగాల ప్రతిమలతో రూ.300 కోట్ల ఖరీదైన దుర్గా (Durga) మండపం సిద్ధమవుతోంది. దేశంలో అత్యంత ఖరీదైన దసరా మండపం ఇదే అని సమాచారం. ఇండోర్లోని వీఐపీ పరస్పర్ నగర్ ఆవరణలో 30 ఎకరాలకు పైగా విస్తరించిన మైదానంలో దక్షిణాది ఆలయాల నిర్మాణశైలిలో ఈ మండపం రూపుదిద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 500 మందికి పైగా కార్మికులు గత మూడు నెలలుగా ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. భక్తుల విరాళాలతో.. కృష్ణగిరి పీఠాధీశ్వరులైన వసంత్ విజయానంద్ గిరి మహరాజ్ మార్గదర్శకత్వంలో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి.
Richest Durga Pendal
పితృపక్షాలు ముగిశాక ఈ నెల 22 నుంచి శరన్నవరాత్రులు మొదలై, అక్టోబరు 2 దాకా కొనసాగుతాయి. ఈ సందర్భంగా ఏనుగు అంబారీపై దుర్గామాతను ఘనంగా మండపంలోకి తీసుకొచ్చి గర్బా నృత్యాలతో నవరాత్రి వేడుకలకు శ్రీకారం చుడతారు. నవరాత్రి వేడుకల్లో దలేర్ మెహందీ, లఖ్వీర్ సింగ్ లఖా, ఉస్మాన్ మీర్, శివమణి వంటి కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. అఖిల భారత కవి సమ్మేళనం జరుపుతారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సాధించే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రాంచీ దసరా వేడుకల్లో దశాబ్దాలుగా ముస్లింల సేవ
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని (Ranchi) మొరాబాదీ మైదానంలో దసరా సందర్భంగా జరిగే సంప్రదాయ రావణ దహన వేడుక మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ కార్యక్రమం కోసం భారీస్థాయిలో రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి బొమ్మలను ముస్లిం కళాకారులు రూపొందిస్తుండటం విశేషం. భారత్లోని గంగా – జమున సంస్కృతికి ప్రతీకగా గత కొన్ని దశాబ్దాలుగా ముస్లిం కళాకారుల కుటుంబాలు ఈ బొమ్మలు తయారుచేస్తున్నాయి. ప్రతి ఏటా తాము చేసే ఈ పనిని కేవలం జీవనోపాధిగా మాత్రమే కాకుండా, సుహృద్భావ సందేశం చాటే పవిత్ర కార్యంలా చూస్తామని వీరు చెబుతున్నారు. ఈ ఏడాది రావణుడి బొమ్మ 70 అడుగులు, మేఘనాథుడు 65, కుంభకర్ణుడి బొమ్మ 60 అడుగులు ఉండేలా సిద్ధం చేస్తున్నారు. దసరాను సామాజిక ఐక్యతా సందేశాన్ని చాటే వేడుకగా ఏటా తాము జరుపుకొంటామని నిర్వాహకులు తెలిపారు.
Also Read : Justice BR Gavai: ప్రభుత్వ వ్యతిరేక ఉత్తర్వుల జారీకు కొందరు వెనుకంజ – సీజేఐ గవాయ్
