Amit Shah : దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలన్న ప్రధాని నరేంద్రమోదీ పిలుపును కేంద్రమంత్రులు అందిపుచ్చుకుంటున్నారు. స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు, డిజిటల్ ఇండియాలో భాగంగా ‘జోహో’ ప్లాట్ఫామ్ వైపు మొగ్గుచూపుతున్నారు. అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ఆ సంస్థ సేవలు వినియోగిస్తుండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) జోహో మెయిల్లోకి మారిపోయారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Amit Shah Switched to Zoho Mail
‘‘హలో.. నేను జోహో మెయిల్కు మారాను. నా ఈమెయిల్ చిరునామాలో ఈ మార్పును గమనించండి. amitshah.bjp@ zohomail.in నా కొత్త మెయిల్ అడ్రస్’’ అని అమిత్ షా తన పోస్టులో రాసుకొచ్చారు. ఇకనుంచి మెయిల్స్ అన్నీ ఈ కొత్త అడ్రస్కే పంపాలని చెప్పారు. భారత్పై అమెరికా సుంకాల మోత, జీఎస్టీ సంస్కరణల వేళ ప్రధాని మోదీ ‘స్వదేశీ’ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘‘భారత్ బలమైన దేశంగా ఎదుగుతున్న వేళ.. కొన్ని సవాళ్లు తప్పవు. అటువంటి సమయాల్లో ‘ఆత్మనిర్భర్’ స్ఫూర్తిని కొనసాగించాలి. ఈ నేపథ్యంలో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించండి’’ అని ఎన్డీయే ఎంపీలకు సూచించారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు జోహో సేవలను వినియోగిస్తున్నారు.
జీమెయిల్, మైక్రోసాఫ్ట్ ఔట్లుక్కు పోటీగా జోహో మెయిల్ ను తీసుకువచ్చారు. ఇప్పుడు ఈమెయిల్లోకి అమిత్ షా మారగా.. మైక్రోసాఫ్ట్ పవర్పాయింట్ బదులు జోహోతోనే కేబినెట్ ప్రంజెంటేషన్ తయారు చేసినట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. జోహో రూపొందిన మెసేజింగ్ యాప్ ‘అరట్టై’ని వాడాలంటూ ధర్మేంద్ర ప్రదాన్ ఇంతకుముందు పిలుపునిచ్చారు. ప్రస్తుతం అరట్టైకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ యాప్ను విపరీతంగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. యూజర్ల ప్రైవసీ కోసం త్వరలోనే ‘అరట్టై’లోనూ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను అందుబాటులోకి తీసుకొస్తామని జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తాజాగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో సమాచార గోప్యతపై పెద్దఎత్తున చర్చ జరుగుతోన్న సమయంలో ఈ స్పందన వచ్చింది.
Also Read : Zubeen Garg: సింగర్ జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్
