Rahul Gandhi: బిహార్ లో మత్సకారుడు అవతారం ఎత్తిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌

బిహార్ లో మత్సకారుడు అవతారం ఎత్తిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌

Rahul Gandhi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ… అదానీ, అంబానీ చేతుల్లో కీలుబొమ్మగా మారారని కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ చేయగానే భయపడి పాకిస్తాన్‌తో యుద్ధాన్ని విరమించారని ఎద్దేవా చేశారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన బెగూసరాయి, ఖగారియా జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల సభల్లో ప్రసంగించారు. బిహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెగూసరాయి జిల్లాలో కొద్దిదూరంలోని చెరువులో జాలర్లు చేపలు పట్టడాన్ని గమనించి వికాస్‌ శీల్‌ ఇన్‌సాన్‌ పార్టీ నేత, మాజీ మంత్రి ముఖేశ్‌ సాహ్నితో కలిసి ఆయన చిన్న పడవలో చెరువులోకి వెళ్లారు. జాలర్లతో మాట్లాడుతూనే… పడవలో నుంచి ఛాతీవరకు నీళ్లున్న చెరువులోకి ఒక్కసారిగా దూకేశారు. ఇద్దరు నేతలు జాలర్లతో కలిసి కొద్దిసేపు చేపలు పట్టారు. రాహుల్‌ చేపలు పడుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

‘పెద్ద ఛాతీ ఉండగానే శక్తిమంతులు అయిపోరు. మహాత్మాగాందీని చూడండి. చూడటానికి పీలగా ఉండే ఆయన నాడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బ్రిటిష్‌వారిని ఎదిరించి పోరాడారు. కానీ, 56 ఇంచుల ఛాతీ అని గొప్పలు చెప్పుకుంటున్న నరేంద్రమోదీ (PM Modi)… ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ట్రంప్‌ ఫోన్‌ చేయగానే వణికిపోయారు. పాకిస్తాన్‌పై చేపట్టిన సైనిక చర్యను రెండు రోజుల్లోనే విరమించారు. ట్రంప్‌ను చూసి భయపడటమే కాదు.. ఆయన అదానీ, అంబానీ చేతుల్లో కీలుబొమ్మగా కూడా మారిపోయారు. ట్రంప్‌ చెప్పగానే మోదీ (PM Modi) ఆపరేషన్‌ సిందూర్‌ను నిలిపేశారు’అని విమర్శించారు. ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయాలన్నీ దేశంలోని పెద్ద వ్యాపారస్తుల ప్రయోజనాల కోసమేనని రాహుల్‌గాంధీ విమర్శించారు. మోదీ ఏది చేసినా ఓట్ల కోసమే చేస్తారు. ఓట్లకోసం వేదికలపై డ్యాన్సులు కూడా చేస్తారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కార్పొరేట్ల కోసం మాత్రమే పనిచేస్తారు. బీజేపీ మీకు తక్కువ ధరకు ఇంటర్నెట్‌ ఇస్తుంది. దానితో మీరు రీల్స్‌ చూస్తారు.. చేస్తారని అన్నారు.

Rahul Gandhi – బిహార్‌ లో గెలిచి 18న ప్రమాణం చేస్తాం – తేజస్వీ యాదవ్

బిహార్‌లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని ఇండియా కూటమి తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ పునరుద్ఘాటించారు. ‘‘ఈ నెల 14న శాసనసభ ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. 18న ప్రభుత్వం కొలువుదీరుతుంది. ఆరోజు ప్రమాణ కార్యక్రమం ఉంటుంది’’ అని తెలిపారు. జనసురాజ్‌ పార్టీకి మద్దతిస్తున్న దులార్‌ చంద్‌ హత్యకు సంబంధించి జేడీ(యూ) అభ్యర్థి, మొకామా మాజీ ఎమ్మెల్యే అనంత్‌ సింగ్‌ అరెస్టు నేపథ్యంలో తేజస్వి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇవాళ ప్రధానమంత్రి బిహార్‌ను సందర్శిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితిని ఆయన గమనించాలి. నేరం జరగకుండా ఒక్కరోజు కూడా గడవటంలేదు. కానీ మహాగఠ్‌బంధన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక మార్పు వస్తుంది. కులమతాలతో సంబంధం లేకుండా ఈ నెల 26 నుంచి జనవరి 26 వరకు నేరస్థులందరినీ జైళ్లకు పంపిస్తాం. సాధ్యమైనంత కఠిన చర్యలు వారిపై తీసుకుంటాం’’ అని చెప్పారు. బిహార్‌ ప్రజలు ఈసారీ నీతీశ్‌ కుమార్‌పై నమ్మకం ఉంచుతారని తెలిసి విదేశాల్లో విహారయాత్రకు వెళ్లేందుకు తేజస్వి టికెట్లు కొనుగోలు చేసినట్లు తనకు తెలిసిందని కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ ఎద్దేవా చేశారు.

భద్రత పెంచండి – తేజ్‌ ప్రతాప్‌

ప్రస్తుత పరిస్థితుల్లో తనకు ముప్పు పొంచి ఉందని.. భద్రతను మరింత పెంచాలని ‘జనశక్తి జనతా దళ్‌’ (జేజేడీ) చీఫ్‌ తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల దుండగుల కాల్పుల్లో.. దులార్‌ చంద్‌ మరణించిన నేపథ్యంలో తనకూ ప్రాణ భయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : Rahul Gandhi: బిహార్ లో మత్సకారుడు అవతారం ఎత్తిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌

Leave A Reply

Your Email Id will not be published!