Divya Gautam: బిహార్ ఎన్నికల బరిలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సోదరి
బిహార్ ఎన్నికల బరిలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సోదరి
Divya Gautam : బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్కు గడువు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సమీప బంధువు దివ్యా గౌతమ్ (Divya Gautam) (సోదరి వరుస) ఎన్నికల బరిలో ఉన్నారు. సీపీఐ(ఎంఎల్)కు చెందిన ఆమె, దిఘా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి గత రెండు పర్యాయాలు బీజేపీ (BJP) నేత సంజీవ్ చౌరాసియా గెలువగా… ఈసారి మహాగఠ్బంధన్ తరఫున ఆయనపై దివ్య (Divya Gautam) పోటీకి దిగారు.
పట్నా యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దివ్య… టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో వుమెన్స్ స్టడీస్ విభాగంలో మాస్టర్స్ పట్టా పొందారు. బిట్స్ పిలానీ నుంచి పీహెచ్డీ చేశారు. మూడేళ్లపాటు పట్నా వుమెన్స్ కాలేజీలో అధ్యాపకురాలిగా పనిచేసిన ఆమె.. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో నెగ్గి సప్లై ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. పట్నా యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలిగా (2012లో) ఉన్న సమయంలోనే దివ్య రాజకీయ ప్రస్థానం మొదలైంది.
కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయాల్లోకి రాలేదని, సమాజంలో నిజమైన మార్పును తేవడమే తన ప్రయత్నమన్నారు. విద్య, ఉపాధి, మహిళా భద్రత, ఆరోగ్య సంరక్షణ, స్థానిక అభివృద్ధిపైనే దృష్టి పెడతానని చెబుతున్న దివ్య (Divya Gautam).. మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్పుత్ను ప్రస్తావిస్తూ.. తన సోదరుడి పేరును కొన్ని రాజకీయ పార్టీలు వాడుకొని వదిలేశాయని ఆరోపించారు.
Divya Gautam – హత్యలు, అపహరణలు, దోపిడీలకు మంత్రిత్వశాఖలు – అమిత్ షా
బిహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఒకవేళ ఇండియా కూటమికి వస్తే… హత్యలు, అపహరణలు, దోపిడీలకు మూడు మంత్రిత్వ శాఖలను తేజస్వీ యాదవ్ ఏర్పాటు చేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్షా తీవ్ర ఆరోపణ చేశారు. ఇదివరకు ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు అపహరణలు, అత్యాచారాలతో ఆటవిక పాలనను బిహార్ చూసిందని, అది మళ్లీ రాకుండా ఓటర్లంతా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ముజఫ్ఫర్పుర్, వైశాలీ జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆదివారం ఆయన ప్రసంగించారు.
మోదీ, నీతీశ్లు నిష్కళంకులు
‘‘బిహార్లో కొత్త ముఖాలతో జంగిల్రాజ్ను తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అది జరగకుండా ఎన్డీయేను గెలిపిస్తే వరదల నుంచి విముక్తి కల్పించడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేస్తాం. భద్రతకు పెద్దపీట వేస్తాం. నదుల నీరు పొలాలకు పారేలా చూస్తాం. అంతర్గత కలహాలతో మహాగఠ్బంధన్ సతమతం అవుతోంది. లాలూ అండ్ కో, రాహుల్ అండ్ కో రూ.12 లక్షల కోట్ల అవినీతి, కుంభకోణాలకు పాల్పడ్డాయి. ఎన్డీయేలోని ఐదు మిత్రపక్షాలు మాత్రం బిహార్ను సరికొత్త ఎత్తుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉన్నాయి. ఈ పక్షాలు పంచపాండవుల్లాంటివి. నీతీశ్ 20 ఏళ్ల పాలన, మోదీ 11 ఏళ్ల పాలన పూర్తిగా పారదర్శకం. వారిపై అవినీతి అభియోగాల్లేవు. మా కూటమిని గెలిపిస్తే 50 వేల కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తాం. వ్యవసాయంపై రూ.లక్ష కోట్లు వెచ్చిస్తాం. భారీ ఫుడ్పార్క్, ఇండస్ట్రియల్ పార్క్లు ఏర్పాటు చేయిస్తాం. లాలూ-రబ్రీ గానీ, సోనియాగానీ ఇలాంటివి చేయగలరా?’’ అని అమిత్ షా ప్రశ్నించారు.
Also Read : Rahul Gandhi: బిహార్ లో మత్సకారుడు అవతారం ఎత్తిన కాంగ్రెస్ నేత రాహుల్
