హైదరాబాద్ : ఓ వైపు అధికారాన్ని కోల్పోయినా బలమైన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు తమ వాణిని వినిపిస్తూ వస్తున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు కంట్లో నలుసు లాగా తయారైంది తన స్వంత, ముద్దుల కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. శాసన మండలిలో ఇవాళ ఆమె సుదీర్ఘ ప్రసంగం చేశారు. అంతే కాదు తాను తన శాసన మండలి సభ్యురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలోనే ఇచ్చానని, కానీ ఇప్పటి వరకు ఆమోదించ లేదని అన్నారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను ఆమోదించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు. ఇదే సమయంలో తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
విచిత్రంగా తన తండ్రిని, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, కేటీఆర్ లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు కల్వకుంట్ల కవిత. ఆమె మండలి సాక్షిగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీశాయి. ప్రధానంగా మాజీ మంత్రులు చేసిన అక్రమాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇదే సమయంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి కలెక్టరేట్ భవనాల వరకు అన్నిట్లో అవినీతికీ పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు. సిరిసిల్ల, సిద్దిపేట కలెక్టరేట్ భవనాలు ఎంత నాణ్యతతో కట్టారు అంటే కట్టిన మొదటి ఏడాదే నీటిలో మునిగి పోయాయంటూ ఎద్దేవా చేశారు. అమర వీరుల గుర్తుగా కట్టిన అమరజ్యితి నిర్మాణంలో కూడా అవినీతికి పాల్పడ్డారంటూ ఫైయ్యారు.
