అమరావతి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరాక ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆవేదన చెందారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్వాకంపై , తీసుకుంటున్న నిర్ణయాలపై మండిపడ్డారు. మండల పరిషత్ అధ్యక్ష ఉప ఎన్నికల కోసం వేధింపులకు గురి చేస్తున్నారని, పట్టపగలే తమ పార్టీకి చెందిన వారిని కిడ్నాప్ నకు పాల్పడ్డారని ఆరోపించారు.ఈ సందర్బంగా వింజమూరు, బొమ్మనహళ్లి ఎంపీపీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని జగన్ డిమాండ్ చేశారు ఈ సందర్బంగా స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత వాతావరణంలో కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. లా అండ్ ఆర్డర్ ను కూటమి నేతలు తమ చేతుల్లోకి తీసుకున్నారంటూ మండిపడ్డారు. సహించే ప్రసక్తి లేదన్నారు.
తమ హయాంలో కూటమి నేతలకు స్వేచ్ఛ ఉండేదని , కానీ వాళ్లు అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు జగన్ మోహన్ రెడ్డి. ఇది మంచి పద్దతి కాదన్నారు . తాము పూర్తిగా సంయమనంతో ఉన్నామని, కానీ వారే కావాలని రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, డెమోక్రసీకే రక్షణ లేకుండా పోయిందన్నారు. హింసను ఉదహరిస్తూ చిన్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం క్రూరంగా హత్యకు గురవుతోందని వాపోయారు జగన్ రెడ్డి. టీడీపీ దౌర్జన్యాలు, బెదిరింపులకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో గుణపాఠం చెబుతారంటూ హెచ్చరించారు.
