విజయవాడ : కళలు, సంస్కృతికి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తామని ప్రకటించారు రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా విజయవాడ వేదికగా పెద్ద ఎత్తున అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్ ను నిర్వహించింది. పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ వేదికలుగా మూడు రోజుల పాటు నిర్వహించిన ఈఫెస్టివల్ అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ వేడుకలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు కందుల దుర్గేష్. ఈ సందర్భంగా అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్ను ఒక ప్రత్యేక బ్రాండ్గా తీర్చిదిద్దుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఏటా ఈ ఉత్సవాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు కందుల దుర్గేష్. అందులో భాగంగా 2026 డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్ను మళ్లీ ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు .
కళలు, సంస్కృతికి పునర్వైభవం తీసుకు రావడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అన్నారు. త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహించి, నంది అవార్డుల ప్రదానం చేస్తామన్నారు. నాటకం, సినిమా, సాహిత్యం ఒకే వేదికపై మెరిసిన ఈ ఫెస్టివల్లో జరిగిన చర్చలు, ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని అన్నారు కందుల దుర్గేష్. మూడు రోజుల వేడుకల్లో భాగంగా భవానీ ఐలాండ్కు 15,000 మంది పున్నమి ఘాట్కు 30,000 మంది మొత్తంగా 45,000 మందికి పైగా సందర్శకులు పాల్గొనడం ఈ కార్యక్రమం విజయానికి నిదర్శనం అన్నారు. అమరావతిని ప్రజా రాజధానిగా, ఆవకాయను ఆంధ్రుల సాంస్కృతిక అంతర్భాగంగా నిలబెట్టే దిశగా ఈ ఫెస్టివల్ ముందడుగు వేసిందని చెప్పారు. ఈ వేడుకలను విజయవంతం చేసిన పర్యాటక శాఖ అధికారులు, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ ప్రతినిధులు, కళాకారులు, ప్రజలందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
