తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. గత ఏడాది డిసెంబర్ 30 నుండి ఈ ఏడాది జనవరి 8వ తేది వరకు నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తులు విశేష సంతృప్తి వ్యక్తం చేశారని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం కావడంతో ఆయన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మీడియాత మాట్లాడారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారని అన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ సహకారంతో ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా టోకెన్ లేని భక్తులకు కూడా వేగవంతంగా దర్శనం కల్పించామన్నారు చైర్మన్. వైకుంఠ ద్వార దర్శనాలపై దాదాపు 93 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఈ పది రోజుల్లో స్వామి వారిని 7.83 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. గత వైకుంఠ ద్వార దర్శనాల్లో 6.83 లక్షల మంది దర్శించుకోగా ఈ ఏడాది లక్ష మంది భక్తులకు అదనంగా దర్శించుకున్నారని చెప్పారు. జనవరి 2వ తేది శుక్రవారం రోజు అయినప్పటికీ రికార్డు స్థాయిలో 83 వేల మంది భక్తులకు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక 3వ తేది శనివారం అత్యధికంగా దాదాపు 89 వేల మందికి దర్శన భాగ్యం కల్పించడం జరిగిందన్నారు. అందు బాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164 గంటల సమయం సామాన్య భక్తులకు కేటాయించడం జరిగిందని చెప్పారు. తమ ప్రయారిటీ కేవలం సామాన్యులకేనని పేర్కొన్నారు.
