అమరావతి : గ్రామాల అభివృద్ది ఇంటి నుండే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు వంగలపూడి అనిత. పరిసరాల పరిశుభ్రత ప్రతి విద్యార్థికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేసి, వారితో సరదాగా ముచ్చటించారు.
జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు అనిత వంగలపూడి. మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని చెప్పారు. బాలికలు ధైర్యంగా ఉండాలని, కొంతమంది పిల్లలు సోషల్ మీడియాకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనిత వంగలపూడి. చిన్న, చిన్న పొరపాట్లు వలన పిల్లల జీవితాలను నాశనం చేసుకోకూడదని సూచించారు. మంచిగా చదువుకొని మహోన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. చట్టాలపై అవగాహన చేసుకోవాలని కోరారు. విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. ఈ సంధర్బంగా విద్యార్థులు క్రీడా మైదానం కావాలని కోరగా, త్వరలోనే గ్రౌండ్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
