కాకినాడ: అన్నిరంగాల్లో ఆంధ్రప్రదేశ్ ను నెం.1గా ఉంచాలన్నదే మా లక్ష్యం. అందులో విద్యార్థులంతా భాగస్వాములయ్యేలా మీ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే నా ధ్యేయం. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ లో హలో లోకేష్ పేరిట నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలిచ్చారు. కార్యక్రమానికి జేఎన్టీయూ ఈసిఇ 3వ సంవత్సరం విద్యార్థిని ప్రాప్తి సంధానకర్తగా వ్యవహరించారు.
జీవితంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, ఆ నిర్ణయాలే మన జీవితాన్ని మారుస్తాయి. పాదయాత్ర నిర్ణయం నా జీవితాన్ని మార్చేసింది. రాష్ట్రంలో కోట్లాది ప్రజలు, యువత ఆశలు, ఆకాంక్షలు, సమస్యలను తెలుసుకునే అవకాశం లభించిందని అన్నారు లోకేష్. ఎంతో నేర్చుకున్న. నాటి అనుభవాలనే ఇప్పుడు ప్రభుత్వంలో అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంలోకి రావడంతోనే మా పని పూర్తికాలేదు, అసలు పని ఇప్పుడే మొదలైంది. ఇకపై నెలకు ఒకసారి విద్యార్థులను కలవాలని భావిస్తున్నాను. దీని ద్వారా విద్యార్థుల ఆకాంక్షలు, మనోగతాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. మీరు అద్భుతమైన ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సమస్యలు చెప్పారు. మీ ఫీడ్ బ్యాక్ సీరియస్ గా తీసుకుంటాం.
మీ సలహాలు కరిక్యులమ్ ఇంప్రూవ్ మెంట్ కు దోహదపడతాయి. ఏ స్థాయిలో ఉన్నా మోరల్ వాల్యూస్ మరువద్దు. నైతిక విలువలు నేర్పించేందుకు చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వ సలహాదారుగా నియమించాం. ఆయనకు కేబినెట్ ర్యాంకు ఇస్తే ప్రభుత్వం నుంచి ఎటువంటి సదుపాయాలు తీసుకోవడం లేదన్నారు. అమ్మకు చెప్పలేని పని మనం చెయ్యకూడదు అని గొప్ప మాట చెప్పారు. అది సింపుల్, పవర్ పుల్ మాట అని గుర్తు చేశారు నారా లోకేష్.
