పీపీపీ మోడల్ లో ఓడరేవుల నిర్వహణ : జనార్దన్ రెడ్డి
ఏపీ శాసన మండలిలో కీలక ప్రకటన చేసిన మంత్రి
అమరావతి : ఏపీ రాష్ట్రంలో ఓడ రేవుల అభివృద్దికి సంబంధించి కీలక ప్రకటన చేశారు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి. గురువారం శాసన మండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, బీటీ నాయుడు, బీద రవిచంద్రలు ప్రశ్నలకు మంత్రి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని ఉన్న ఏకైక మేజర్ పోర్ట్ అయిన విశాఖ పోర్టు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 141.6 MMTPA సామర్థ్యంతో పని చేస్తోందని చెప్పారు. నాన్-మేజర్ పోర్ట్ లు గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ లు మారిటైమ్ బోర్డు నియంత్రణలో PPP మోడల్ లో నిర్వహించ బడుతున్నాయని చెప్పారు.
ఇదే క్రమంలో అదానీ గంగవరం పోర్టు 64 MMTPA సామర్థ్యంతో, కాకినాడ డీప్ వాటర్ పోర్టు 26 MMTPA సామర్థ్యంతో, కృష్ణపట్నం పోర్టు 98 MMTPA సామర్థ్యంతో పని చేస్తున్నాయని స్పష్టం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నాన్-మేజర్ పోర్ట్¬లు కాకినాడ యాంకరేజ్ పోర్ట్, కోనసీమ జిల్లాలోని రవ్వా పోర్ట్ లను ఏపీ మారిటైమ్ బోర్డు నిర్వహణలో ఉన్నాయని వెల్లడించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు 5 MMTPA సామర్థ్యం, రవ్వా పోర్టు 2 MMTPA సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు మంత్రి. EPC విధానంలో రామాయపట్నం, మచిలీపట్నం, మూలాపేట (3) గ్రీన్ ఫీల్డ్ పోర్టులు ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. రామాయపట్నం పోర్టు – 24-04-2026, మచిలీపట్నంలో పోర్టు ఈ ఏడాది డిసెంబర్ నాటికి, మూలపేట పోర్టు నవంబర్ 30వ తేదీ నాటికి పూర్తి కానున్నాయని స్పష్టం చేశారు.
PPP మోడల్ BOOT (బిల్డ్, ఓన్, ఆఫరేట్, ట్రాన్స్ ఫర్) పద్దతిలో తూర్పు గోదావరి జిల్లా కోన గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ కమర్షియల్ పోర్టు అభివృద్ధి చేస్తున్నాం అని తెలిపారు. ఇది జూలై 2వ తేదీ నాటికి పూర్తవుతుందన్నారు. నిర్మాణంలో ఉన్న ఈ పోర్టులన్నీ అవి పూర్తైన తేదీ నుండి 6 – 9 నెలలలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ల్యాండ్ లార్డ్ మోడల్ లో నిర్మిస్తున్న మూలాపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు రైలు, రోడ్డు కనెక్టివిటీకి అవసరమైన భూమి, నిర్మాణ ఖర్చులను ఏపీ మారిటైమ్ బోర్డ్ సమకూరుస్తోందని వెల్లడించారు బీసీ జనార్దన్ రెడ్డి. పిపిపి విధానంలో నిర్మిస్తున్న కాకినాడ సెజ్ పోర్టు విషయంలో NH-16 కి రోడ్డు అనుసంధానం NHAI అందిస్తోందని స్పష్టం చేశారు.
