ప్రకృతి వైపరీత్యాల్లో అన్న‌దాత‌ల‌కు అండ‌గా ఉంటాం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడం, అర‌కులో కాఫీ తోట‌ల న‌ష్టంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి శాసన మండలిలో వివరించారు. నష్టపోయిన ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ స్థాయిలో పంట నష్టాన్ని వారం రోజుల్లో అంచనా వేసి నివేదికలు సిద్ధం చేశార‌ని చెప్పారు. ఆ నివేదికల ఆధారంగా అర్హులైన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్ట పరిహారం అందచేశామ‌ని మంత్రి పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సహాయాన్ని త్వరితగతిన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో సహాయం అందిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలో 2014 వరకు పత్తి, వేరుశెనగ, వరి, చెరుకు పంటలకు హెక్టారుకు రూ.12,000 ఇన్‌పుట్ సబ్సిడీని అందించామ‌న్నారు. 2014 లో తెదేపా ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక సీఎం చంద్ర‌బాబు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తాన్ని హెక్టారుకు రూ.17,000కు పెంచినట్లు వివరించారు. అయితే గత వైసీపీ పాల‌న‌లో ఆ మొత్తాన్ని తిరిగి రూ.12,000కు తగ్గించారని మంత్రి పేర్కొన్నారు. 2024 లో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక‌ బుడమేరు వరదల సమయంలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచించి హెక్టారుకు రూ.25,000 వరకు నష్ట పరిహారం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.

బుడమేరు వరదల అనంతరం కేవలం వారం రోజుల్లోనే సర్వే పూర్తి చేసి సుమారు రూ.370 కోట్ల నష్టపరిహారాన్ని రైతులకు అందించామని చెప్పారు అచ్చెన్నాయుడు. రాష్ట్ర చరిత్రలో రైతులతో పాటు కౌలు రైతులకు కూడా నష్టపరిహారం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల సంభవించిన తుఫాన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికే రూ.25 కోట్లు, రూ.34 కోట్లు, రూ.310 కోట్ల వరకు రైతులకు నష్టపరిహారం చెల్లించిందని తెలిపారు. ఇటీవల వచ్చిన మొందా తుఫాన్‌కు సంబంధించిన నష్టాల సర్వే పూర్తయిందని, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం అందజేస్తుందని మంత్రి పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!