హైదరాబాద్ : కోకాపేట విశాఖ శ్రీ శారదా పీఠంలోని శ్రీ రాజ శ్యామల అమ్మ వారి దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పీఠం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి పోయింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ శారదా చంద్ర మౌలీశ్వర ఆరాధనతో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం గాయని నిత్య సంతోషిణి , బృందం సమర్పించిన భక్తి సంగీత విభావరి భక్తులకు ఆధ్యాత్మిక పరవశం అందించింది.
తరువాత విశాఖ శ్రీ శారదా పీఠం గంటల పంచాంగాన్ని ఘనంగా ఆవిష్కరించారు. పంచాంగ శ్రవణం కార్యక్రమంలో శ్రీ చిర్రావూరి విజయనాథ్ శర్మ నూతన సంవత్సర ఫలితాలను వివరించారు . అనంతరం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహా స్వామివారు భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా మహాస్వామి వారు మాట్లాడుతూ, విశాఖ శ్రీ శారదా పీఠంలో జరిగే ప్రతీ కార్యక్రమం రాష్ట్ర శ్రేయస్సు, దేశ క్షేమం కోసమే నిర్వహించ బడుతుందని తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, తెలుగు ప్రజలు అత్యున్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు.
దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, దేశ శ్రేయస్సే ముఖ్య ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తరువాత వేడుకలకు హాజరైన భక్తులకు ఉగాది పచ్చడి, మహా ప్రసాదం పంపిణీ చేశారు. ఈ ఏడాదంతా మంచే జరుగుతుందన్నారు.