కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోని నేత‌లు అక్క‌ర్లేదు : సీఎం

నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా పార్టీ జాతీయ అధ్య‌క్షుడైన బాబు జెండాను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. డి-లిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై కూడా ప్ర‌స్తావించారు. కార్యకర్తలను పట్టించుకోని నేతలకు నాకు అక్కర్లేదంటూ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం పని చేస్తానంటూ కార్యకర్తలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఎవరు బాగా పని చేస్తే వారే ప్రజాప్రతినిధులు అని పేర్కొన్నారు. ఈ సారి 50 శాతం సీట్లు పెరుగుతాయన్నారు. 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయన్నారు. క్రమశిక్షణతో పని చేయాల‌ని, పార్టీని బలోపేతం చేయాల‌ని కోరారు. కార్యకర్తలను గుర్తించే ప‌ని లోకేష్ దేన‌ని చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఆదర్శంగా ఉండాలన్నారు. వ్యక్తిగత ప్రవర్తన నుంచి ప్రతి అంశంలో తెలుగుదేశం బ్రాండ్ నిలిపేలా వ్యవహరించాలని స్ప‌ష్టం చేశారు.

అభివృద్ధి వైకుఠంపాళి కాకూడదన్నారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటేనే.రాష్ట్రం బలంగా ఉంటుంద‌న్నారు. పార్టీ గెలుపే రాష్ట్రం గెలుపు. పసుపు జెండా నిరంతరం ఎగరాలన్నారు. రాష్ట్రం ఎప్పుడూ గెలవాల‌న్నారు. తెలుగు దేశం పుట్టుక నుంచి నేటి వరకు మన సిద్దాంతాలు, విజయాలు, ప్రయాణం…అన్నీ సంచలనమేన‌ని పేర్కొన్నారు సీఎం. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే… ప్రజలే రోడ్డెక్కి ఉద్యమించారు. ఇదొక రికార్డు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమానికి నాంది పలికింది తెలుగుదేశం. అభివృద్దికి అడుగులు వేసిందన్నారు. 40 ఏళ్ల క్రితం టీడీపీ తెచ్చిన రూ.2కే కిలో బియ్యం జాతీయ ఆహార భద్రతా పథకమైందన్నారు సీఎం.

అప్పుడు తెచ్చిన మహిళలకు ఆస్తి హక్కు తరువాత కేంద్రం చట్టం చేసిందన్నారు. మహిళలకు నాడు స్థానిక ఎన్నికల్లో కల్పించిన రిజర్వేషన్… దశాబ్దాల తరువాత 33 శాతం రిజర్వేషన్‌కు అడుగులు పడడానికి కారణం అయ్యిందన్నారు . మన ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ సంస్కరణలు.. ఆ తర్వాత ఎన్నో రాష్ట్రాలకు రోల్ మోడల్ అయ్యాయని అన్నారు. మహిళా సాధికారతకు తెచ్చిన డ్వాక్రా సంఘాలు దేశంలోనే రోల్ మోడల్‌గా నిలిచాయన్నారు. బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టాం. ఎస్సీలకు వర్గీకరణతో సమన్యాయం చేశాం. ఎస్టీలకు భూములు, పథకాలు ఇచ్చి జీవితాలు మార్చాం అన్నారు. మైనారిటీల కోసం కార్పొరేషన్ తీసుకొచ్చాం. వారి జీవన ప్రమాణాలు పెంచాం. తెలుగుదేశం పార్టీ విజయాలనే కాదు…సంక్షోభాలను, సవాళ్లను చూసిందన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

ఎంతోమంది కార్యకర్తలు త్యాగాలు చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు కోల్పోయారు. నిద్రలేని రాత్రులు గడిపారు. టీడీపీని ఫినిష్ చేస్తామని ఆలోచన చేసిన వారే ఫినిష్ అయ్యారు. ఇందిరా హయాంలో ఎన్టీఆర్‌ను గద్దె దించి కుట్రలు పన్నారు. అలిపిరిలో నాపై హత్యాయత్నం చేశారు. 2004 తరువాత టీడీపీ కార్యకర్తల, నేతల ప్రాణాలు తీశారు. ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల పిల్లలను దత్తత తీసుకుని ఎన్టీఆర్ స్కూల్ ఏర్పాటు చేసి చదివించాం. గత ప్రభుత్వ విధ్వంసంపై లోకేష్ యువగళం పాదయాత్ర చేపడితే అడ్డుకున్నారు. కార్యకర్తల అండతో అడుగు ముందుకే వేశాడు. 2019-24 మధ్య కాలంలో నన్ను కూడా జైల్లో పెట్టారు. ఇన్నేళ్ల ప్రస్థానం, నేటి ఈ అధికారం అంతా కార్యకర్తల త్యాగాలు, కష్టం వల్లనే వచ్చింది కార్యకర్తల సంక్షేమం కోసం ట్రస్ట్ ద్వారా వేల మందికి ఉచిత విద్యను అందిస్తున్నాం.

Leave A Reply

Your Email Id will not be published!