వైభవోపేతం శ్రీ కోదండ రాముని తెప్పోత్సవం

పుష్క‌రిణింలో ఘ‌నంగా ప్రారంభం

తిరుపతి : తిరుపతి లోని శ్రీ కోదండ రామస్వామి వారి తెప్పోత్సవాలు శ్రీ రామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారు ఆశీనులై ఐదు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై కర్పూర నీరాజనాలు సమర్పించారు . ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవ మూర్తులను రామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేశారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు తెప్పోత్సవం నిర్వహించారు. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతారామ లక్ష్మణులు ఆశీనులై ఐదుచుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు. ఇదిలా ఉండ‌గా శ్రీ కోదండ రామ‌స్వామి తెప్పోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయ‌డం ప‌ట్ల సుదూర ప్రాంతాల నుండి తండోప తండాలుగా వ‌చ్చిన భ‌క్త బాంధ‌వులు టీటీడీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. మ‌రో వైపు ఒంటిమిట్ట‌లో శ్రీ కోదండ రామ‌స్వామి వార్షిక బ్రహ్మోత్స‌వాలు ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి.

రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దంప‌తులు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!